ఒప్పో ఏ55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన చవకైన 5జీ ఫోన్ ఇదే. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. 6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు.


ఒప్పో ఏ55ఎస్ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,099 యువాన్లుగా (సుమారు రూ.13,100) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లుగా (సుమారు రూ.14,300) ఉంది. బ్రిస్క్ బ్లూ, రిథమ్ బ్లాక్, టెంపెరామెంట్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఒప్పో ఏ55ఎస్ స్పెసిఫికేషన్లు
6.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఒప్పో ఏ55ఎస్‌లో అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగానూ ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. డ్యూయల్ మోడ్ 5జీ నెట్‌వర్క్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 10W స్టాండర్డ్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి.