Google Warning over Public WIFI: మీరు తరచుగా రైల్వేస్టేషన్లు, కేఫ్లు, విమానాశ్రయాలు, హోటళ్లలో ఉచిత Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? అయితే, మీరు వెంటనే ఈ అలవాటును మార్చుకోవాలి. పబ్లిక్ Wi-Fi సైబర్ నేరస్థులకు వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, చాట్లను దొంగిలించడానికి సులభమైన మార్గంగా మారిందని Google కొత్త నివేదికలో హెచ్చరించింది.
Android: బిహైండ్ ది స్క్రీన్ నివేదిక వెల్లడి
Google తాజా Android: బిహైండ్ ది స్క్రీన్ నివేదిక ప్రకారం.. పబ్లిక్ Wi-Fi నెట్వర్క్లు ఇప్పుడు యూజర్లకు భద్రతా ప్రమాదాలు (Cyber Crime)గా మారుతున్నాయి. హ్యాకర్లు అసురక్షిత నెట్వర్క్లను ఉపయోగించుకుని వినియోగదారుల స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్స్, ఇతర డివైజ్లలోకి ప్రవేశించి పాస్వర్డ్లు, బ్యాంకింగ్ లాగిన్లు లేదా ఇతర వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఆన్లైన్ బ్యాంకింగ్, షాపింగ్ లేదా ఏదైనా ఆర్థిక సంబంధిత అకౌంట్ లాగిన్ అవుతున్నప్పుడు పబ్లిక్ Wi-Fiని ఉపయోగించవద్దని Google తన యూజర్లను ప్రత్యేకంగా హెచ్చరించింది.
పెరుగుతున్న మొబైల్ స్కామ్ల నుంచి ముప్పు
భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో మొబైల్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయి. Google ప్రకారం స్మార్ట్ఫోన్ మోసాలు ఇప్పుడు ఒక గ్లోబల్ సమస్యగా మారింది. ఇది ప్రతి సంవత్సరం వినియోగదారుల బిలియన్ల డాలర్లు దోచుకునేలా చేస్తుంది. ఆ నివేదిక ప్రకారం, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు $400 బిలియన్లు (దాదాపు 33 లక్షల కోట్ల రూపాయలకు పైగా) మొబైల్ స్కామ్ల ద్వారా మోసం చేశారు. ఇందులో చాలా మంది బాధితులు తమ డబ్బును తిరిగి పొందలేకపోయారు.
హ్యాకర్లు ఎలా మోసం చేస్తారు?
Google తెలిపిన ప్రకారం.. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఒక నెట్వర్క్గా పనిచేస్తున్నారు. వారు దొంగిలించిన మొబైల్ నంబర్లను కొనుగోలు చేస్తారు. ఆటోమేటెడ్ సిస్టమ్ల నుండి లక్షలాది సందేశాలను పంపుతారు. ఫిషింగ్-యాజ్-ఎ-సర్వీస్ లాంటి టూల్స్ ఉపయోగించి అసలైన వెబ్సైట్లను తయారు చేస్తారు. తద్వారా ప్రజలు తమ లాగిన్ వివరాలు అందిస్తారు. ఈ నెట్వర్క్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. వాటి స్థానాలను పదేపదే మారుస్తూ మోసాలు చేస్తారు.
సిమ్ కార్డ్లు తీసుకుని కొత్త స్కామ్లను ప్రారంభించడం సైబర్ నేరగాళ్లకు సులభం అవుతుంది. కొన్నిసార్లు వారు ఫేక్ డెలివరీ లేదా టాక్స్ అలర్ట్లను పంపుతారు. కొన్నిసార్లు ఉద్యోగ అవకాశాలు లేదా ఆన్లైన్ రిలేషన్ ఏర్పరచుకోవడం ద్వారా నమ్మకాన్ని పొంది, తరువాత డబ్బును కాజేస్తారు.
భావోద్వేగ బ్లాక్మెయిల్తో దాడి
సాంకేతిక మోసాలతో పాటు ఇప్పుడు స్కామర్లు భావోద్వేగాలను కూడా ఉపయోగిస్తున్నారు. వారు మీ ఖాతా మూసివేశాం. లేదా "మీ లైసెన్స్ సస్పెండ్ అవుతుంది" వంటి భయం లేదా ఆందోళనను కలిగించే సందేశాలను పంపుతారు. ఇవి చూసిన ప్రజలు ఏం ఆలోచించకుండా వారు చెప్పింది చేస్తుంటారు. కొంతమంది స్కామర్లు గ్రూప్ చాట్లలో తమ సహచరులను చేర్చుకుంటారు. దాంతో అది అసలైన చాటింగ్ గా చూపిస్తారు, తద్వారా బాధితుడిని నమ్మించవచ్చు.
సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలి?
- వినియోగదారులకు Google కొన్ని ముఖ్యమైన భద్రతా చిట్కాలను అందించింది.
- అత్యవసరమైనప్పుడు మాత్రమే పబ్లిక్ Wi-Fiని ఉపయోగించాలి.
- పబ్లిక్ వైఫై ద్వారా బ్యాంకింగ్ లేదా ఏదైనా సున్నితమైన వెబ్సైట్కు లాగిన్ అవ్వకూడదు
- Wi-Fi ఆటో కనెక్ట్ సెట్టింగ్ను ఆఫ్ చేయండి.
- నెట్వర్క్ ఎన్క్రిప్షన్, వాస్తవాలను చెక్ చేయాలి.
ఏదైనా తెలియని సందేశానికి రియాక్షన్ ఇవ్వడానికి ముందు, దాని మూలాన్ని చెక్ చేయాలి. మీ ఫోన్లో సేఫ్టీ యాప్స్ వాడాలి. ఎప్పటికప్పుడూ బ్యాంక్ స్టేట్మెంట్లను చెక్ చేయాలని Google సిఫార్సు చేస్తోంది.