Google Chrome: ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే వెబ్ బ్రౌజర్ క్రోమ్ కు మంచి ఆదరణ ఉంది. చాలా మంది నెటిజన్లు ఈ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నారు. వెబ్ పేజీలను వేగంగా లోడ్ చేయడంలో క్రోమ్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అయితే, ఈ క్రోమ్ బ్రౌజర్ భద్రతకు సంబంధించి కొద్ది రోజులుగా చాలా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ బ్రౌజర్ సేఫ్టీ విషయంలో చాలా వెనుకబడి ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. అంతేకాదు, కొద్ది రోజుల క్రితం గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. కంప్యూటర్లలో క్రోమ్ బ్రౌజర్లను ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT IN వెల్లడించింది. పాత బ్రౌజర్‌లోని లోపాల కారణంగా రిమోట్ యాక్సెస్ ద్వారా మీ కంప్యూటర్ యాక్సెస్ చేసి అందులోని కీలక సమాచారాన్ని సైబర్ నేరస్తులు దొంగిలించే అవకాశం ఉందని వెల్లడించింది. వెంటనే గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.


సరికొత్త సేఫ్టీ ఫీచర్ ను తీసుకొచ్చిన గూగుల్


కేంద్ర ప్రభుత్వంతో పాటు గూగుల్ క్రోమ్ కూడా తమ యూజర్స్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోమని సూచించింది. గూగుల్ తాజాగా విడుదల చేసిన క్రోమ్ అప్‌డేట్‌లో 22 రకాల సెక్యూరిటీ లోపాలను సరిచేసినట్లు వెల్లడించింది. ఇక తాజాగా గూగుల్ డెస్క్ టాప్ లోని క్రోమ్ బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా రన్ అయ్యే కొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఒకవేళ పాస్ వర్డ్స్ విషయంలో పొరపాట్లు చేసి ఉంటే వినియోగదారులను ఈ ఫీచర్ హెచ్చరిస్తుందని తెలిపింది.


ఈ హెచ్చరికలు క్రోమ్ బ్రౌజర్ లోని మూడు చుక్కల మెనులో కనిపిస్తాయి. వెంటనే దాన్ని ఓపెన్ చేసిన తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. క్రోమ్ వినియోగంలో ఉన్నప్పుడు మీ లొకేషన్ లేదంటే మైక్రో ఫోన్ యాక్సెస్ అనుమతులను తొలగించడానికి కూడా కొత్త ఫీచర్ ఉపయోగడపుతుందని గూగుల్ తెలిపింది. వినియోగదారులు అంతగా ఎంగేజ్ చేయని సైట్‌ల నుంచి చాలా నోటిఫికేషన్‌లు వస్తున్నట్లయితే సేఫ్టీ చెక్ ద్వారా వాటిని నిలిపివేసే అవకాశం ఉందని తెలిపింది.


మరింత యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ గా క్రోమ్  


గత ఏడాది డెస్క్‌ టాప్‌లో క్రోమ్ ను వినియోగదారులు మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగించుకునేందుకు గూగుల్ కీలక మార్పులు చేసింది. మెమరీ సేవర్ మోడ్ ను అందుబాటులోకి తెచ్చింది. మెమొరీ సేవర్ మోడ్‌లో ట్యాబ్‌లపై హోవర్ చేసినప్పుడు వాటిని మళ్లీ ఈజీగా గుర్తించే వెసులుబాటు కలిగించింది. అంటే వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే సైట్లను ఈజీగా గుర్తించేలా చేసింది. “ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సైట్‌లను గుర్తించడాన్ని ఇక మరింత సులభతరం చేశాం” అని గూగుల్ తెలిపింది. అంటే క్రోమ్ లో ట్యాబ్ గ్రూపులను కొన్ని వారాల పాటు ఉండే ఏర్పాటు చేసింది. అవసరమైన ట్యాబ్ ను మళ్లీ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పించింది. 


Read Also: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!