ట్విట్టర్‌లో బ్యాన్ అయిన ఖాతాలకు బ్యాడ్ న్యూస్‌. కంపెనీ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఎలాంటి "స్పష్టమైన ప్రక్రియ" లేకుండా అటువంటి ఖాతాలను పునరుద్ధరించబోమని చెప్పారు. ఈ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను శాశ్వతంగా నిషేధించకూడదని, అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిషేధాన్ని వెనక్కి తీసుకుంటానని మస్క్ గతంలో చెప్పారు.


"ట్విటర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాన్ అయిన అకౌంట్లను కొత్త ప్రక్రియను నిర్ణయించేవరకు ప్లాట్‌ఫారమ్‌లో తిరిగి అనుమతింబోం. అలా చేయడానికి కనీసం మరికొన్ని వారాలు పడుతుంది." అని మస్క్ బుధవారం ట్వీట్ చేశారు.


మస్క్ మరొక ట్వీట్‌తో "స్పష్టమైన ప్రక్రియ" ఉండవచ్చని పేర్కొన్నాడు. "ట్విట్టర్ కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్ విస్తృతంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్న ప్రతినిధులను కలిగి ఉంటుంది. ఇందులో పౌర హక్కుల సంఘం, ద్వేషపూరిత హింసను ఎదుర్కొనే టీమ్స్ ఖచ్చితంగా ఉంటాయి." అని మస్క్ ట్వీట్ చేశారు.


ఇటీవలే ట్విట్టర్ బ్లూ టిక్ కోసం కంపెనీ నెలకు 8 డాలర్లను వసూలు చేస్తుందని ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఇందులో చాలా మంది డిమాండ్ చేసిన "వెరిఫైడ్" బ్యాడ్జ్ లేదా "బ్లూ టిక్" కూడా ఉన్నాయి. ట్విట్టర్ ద్వారా డబ్బు ఆర్జించడానికి, ప్రకటనలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మస్క్ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్ క్రియేటర్స్‌కు రివార్డ్ కోసం ఈ నగదును ఉపయోగిస్తామని మస్క్ అన్నారు.


ట్విట్టర్‌లో బ్లూ టిక్ ప్రయోజనాలు
ఎలాన్ మస్క్ చెబుతున్న దాని ప్రకారం ట్విట్టర్‌లోని బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్స్ రిప్లైలు, మెన్షన్లు, సెర్చ్‌లో ప్రాధాన్యత పొందుతారు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు అయితే లెంతీ వీడియోలు, ఆడియోలను కూడా పోస్ట్ చేయగలరు. అలాగే వారికి యాప్‌లో తక్కువ యాడ్లు కనిపిస్తాయి.


ట్విట్టర్ బ్లూ ఇండియాకు వస్తుందా?
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ రుసుమును "ఆయా దేశాల కొనుగోలు శక్తి "ని బట్టి నిర్ణయిస్తామని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. అంటే ఎక్కువగా డిస్కషన్‌లో ఉన్న ట్విట్టర్ బ్లూ ఫీచర్ భారతదేశానికి కూడా చేరుకోవచ్చు. Twitter బ్లూ సర్వీస్, వెరిఫైడ్ టిక్ కోసం ప్రస్తుతం నిర్ణయించిన 8 డాలర్ల రుసుము మనదేశ నగదుకు మారిస్తే రూ.650గా ఉంది. అయితే తక్కువ తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీ ఈ సర్వీసును భారతదేశంలో లాంచ్ చేసినట్లయితే దాని Twitter బ్లూ రుసుమును తగ్గించవచ్చు.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?