ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్‌​ సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ పేరుతో ఇంటికి సాగనంపడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక మస్క్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఉద్యోగుల నుంచి భారీ నిరసనలు ఎదురయ్యాయి. దీంతో మొదటికే మోసం వస్తుందని గ్రహించిన మస్క్​.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను విరమించుకున్నాడు.


తాజాగా మరో కీలక నిర్ణయం విషయంపై పోలీంగ్‌ నిర్వహించాడు ఎలాన్‌ మస్క్‌. పలు కారణాలతో గతంలో నిలిపివేసిన ఖాతాలపై నిషేదాన్ని ఎత్తివేయాలా.? వద్దా.? అని ఫాలోవర్స్‌ని కోరాడు ఎలాన్‌ మస్క్‌. అయితే ఈ పోల్‌లో మొత్తం 31లక్షల మంది యూజర్లు పాల్గొన్నగా.. 72.4శాతం మంది అనుకూలంగా ఓటెయ్యగా.. 28శాతం మంది వ్యతిరేకించారు. దీంతో అవును అనే సమాధానానికి ఎక్కువగా ఓట్స్ వచ్చాయి. దీంతో త్వరలోనే నిషేదం విధించిన అకౌంట్లకు క్షమాభిక్ష పెట్టనున్నాడు ఎలాన్‌ మస్క్‌.


ఈ వారం ప్రారంభంలో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో మరొక పోల్‌ కూడా నిర్వహించారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్‌లో చూడాలనుకుంటున్నారా.? అని యూజర్లను అడిగగా చాలా మంది అవును అని ఓటు వేశారు. దీని తర్వాత US మాజీ అధ్యక్షుడి అకౌంట్‌పై సస్పెన్షన్ తొలగించారు. అయితే ఎవరి అక్కౌంట్స్ త్వరలో మళ్ళీ ట్విట్టర్‌లోకి తిరిగి వస్తాయి అనేది ట్వీట్‌లో స్పష్టం చేయలేదు. ట్విట్టర్‌లో సస్పెండ్ చేసిన కొన్ని ప్రాముఖుల అకౌంట్స్‌లో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, అజీలియా బ్యాంక్స్,  సింగర్ అభిజీత్ భట్టాచార్య ఉన్నారు.


ఎలాన్‌ మస్క్, ఇటీవల ట్విట్టర్‌ బ్లూ టిక్‌ అకౌంట్‌ సేవలకు వినియోగదారులు నెలకు 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఈ విధానాన్ని రీలాంచ్‌ చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా ట్వీట్‌ చేశారు. ప్రజలకు ఎలాంటి అవకతవకలు జరగవని, పూర్తి విశ్వాసం వచ్చాకే ట్విట్టర్‌ బ్లూ సేవలను తిరిగి లాంచ్‌ చేస్తామని ట్వీట్‌ చేశారు. వ్యక్తుల కంటే సంస్థల కోసం డిఫరెంట్‌ కలర్స్‌ చెక్‌లను ఉపయోగిస్తామని తెలిపారు.


మస్క్ ట్విట్టర్ బ్లూను పరిచయం చేసిన తర్వాత.. వివిధ కంపెనీల పేరిట బోగస్ వెరిఫైడ్‌ అకౌంట్లు క్రియేట్‌ అయ్యాయి. ప్రసిద్ధ కంపెనీలు, వ్యక్తులను అనుకరించడానికి చాలా మంది ప్రయత్నించారు. అమెరికాలో ఓ ఫార్మా కంపెనీ పేరిట నకిలీ వెరిఫైడ్‌ అకౌంట్ ఓపెన్‌ చేసిన కొందరు నెగెటివ్‌ న్యూస్ ప్రకటించడంతో.. ఆ కంపెనీ వ్యాల్యూ స్టాక్‌ మార్కెట్‌లో భారీగా పతనమైంది. ఆ ఫేక్ అనౌన్స్‌మెంట్ చేసిన ట్విట్టర్‌ అకౌంట్‌ తమది కాదని సంబంధిత కంపెనీ ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.