India born Aman Sanger youngest AI billionaire: ప్రపంచ టెక్నాలజీ రంగంలో సరికొత్త చరిత్ర . ప్రముఖ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని సంస్థ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కోడింగ్ అసిస్టెంట్ కర్సర్ మాతృసంస్థ అనిస్పియర్ ను ఏకంగా 60 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 5 లక్షల కోట్లు భారీ డీల్తో సొంతం చేసుకున్నారు. ఈ మెగా డీల్తో భారత్కు చెందిన 25 ఏళ్ల అమన్ సాంగర్, పాకిస్తాన్కు చెందిన 26 ఏళ్ల స్వాలెహ్ ఆసిఫ్లు రాత్రికి రాత్రే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్లుగా అవతరించి గ్లోబల్ లైమ్లైట్లోకి వచ్చారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో చదువుకునే రోజుల్లో కేవలం ఒక చిన్న యూనివర్సిటీ ప్రాజెక్ట్గా ప్రారంభమైన కర్సర్ AI .. ఇప్పుడు సిలికాన్ వ్యాలీలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఏఐ కంపెనీగా రికార్డు సృష్టించింది. ఎలాన్ మస్క్ చేసుకున్న ఒప్పందం ద్వారా సహ-వ్యవస్థాపకులైన అమన్ సాంగర్, స్వాలెహ్ ఆసిఫ్లకు తలా 2.7 బిలియన్ డాలర్ల సుమారు రూ. 22 వేల కోట్లు చొప్పున లభించనున్నాయి. ప్రస్తుతం ఈ కోడింగ్ ప్లాట్ఫారమ్ను ఎన్విడియా, అడోబ్, ఉబెర్, షాపిఫై, పేపాల్ వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది డెవలపర్లు ఉపయోగిస్తున్నారు.
ఎవరీ అమన్ సాంగర్?
కేవలం 25 ఏళ్ల ప్రాయంలోనే ఏఐ పరిశ్రమలో అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్గా నిలిచారు అమన్ సాంగర్. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకు జన్మించిన అమన్కు చిన్నతనం నుంచే వ్యాపార, విద్యా వాతావరణం లభించింది. ఆయన తండ్రి అరవింద్ సాంగర్ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి కాగా, తల్లి శిల్పా సాంగర్ ముంబైలో పెరిగి వైద్య రంగంతో పాటు స్టార్టప్ ఇన్వెస్టర్గా రాణించారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో 14 ఏళ్ల వయస్సులోనే కోడింగ్ నేర్చుకున్న అమన్, ఎంఐటీలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. గతంలో గూగుల్, బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్లో ఇంటర్న్షిప్స్ చేసిన ఈ యువకుడు, ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి కర్సర్ కు పునాది వేశారు.
గణిత మేధావి నుంచి టెక్ ఫౌండర్గా స్వాలెహ్ ఆసిఫ్
పాకిస్తాన్లోని కరాచీకి చెందిన 26 ఏళ్ల స్వాలెహ్ ఆసిఫ్కు గణితం, కంప్యూటర్ సైన్స్లో అసాధారణమైన ప్రతిభ ఉంది. ఫోర్బ్స్ కథనం ప్రకారం.. ఆయన 2016 నుండి 2018 వరకు అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభను చాటుకున్నారు. ఎంఐటీలో చదువుతున్న రోజుల్లోనే ఒక ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ స్టార్టప్ను స్థాపించిన అనుభవం ఆయనకుంది. ఆ తర్వాత అమన్ సాంగర్, మైఖేల్ ట్రూయెల్, అర్విద్ లున్నెమార్క్లతో జతకట్టి కర్సర్ ను ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ కోడింగ్ సాధనంగా తీర్చిదిద్దారు.
ఏడాదికి బిలియన్ డాలర్ల ఆదాయం
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ను ఆటోమేట్ చేసే ఏఐ కోడింగ్ టూల్స్ విభాగంలో కర్సర్ సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 కంపెనీలు దీని సేవలను వాడుకుంటుండటంతో, ఈ సంస్థ వార్షిక రన్-రేట్ ఆదాయం 1 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ కోడింగ్ చేసే పద్ధతినే మార్చేస్తున్న ఈ స్టార్టప్పై ఎలాన్ మస్క్ కన్నుపడటం, దానిని రికార్డు స్థాయి వ్యాల్యుయేషన్తో కొనుగోలు చేయడం ఇప్పుడు గ్లోబల్ టెక్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది. యువత ధైర్యం చేసి సరికొత్త ఆలోచనలతో వస్తే గ్లోబల్ బిలియనీర్లు కావచ్చు అని చెప్పడానికి ఈ ఇద్దరు సబ్ కాంటినెంట్ యువకులే నిదర్శనం.
