WhatsApp fraud :  నా పేరుతో ఫేస్‌బుక్ ఐడీ క్రియేట్ అయింది. డబ్బులు అడుగుతున్నారు ఎవరూ స్పందించవద్దు. అని చాలా మంది మెసేజ్‌లు పెట్టడం చూసే ఉంటారు. కానీ ఇది వాట్సాప్‌లోకి వచ్చేసింది. 

మీరు ఆన్‌లైన్‌లో ఇలా వేరే వాళ్ల పేర్లతో  మోసాలు చేస్తున్నారని విన్నారు. కానీ ఇక్కడ మీరు చూసేది చాలా భిన్నమైన కేసు.. ఇది చూస్తే మాత్రం మీరు షాక్ తింటారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫామ్‌లకు పరిమితమైన ఈ మోసం ఇప్పుడు వాట్సాప్‌కి కూడా వచ్చేసింది. 

Paytm స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు ఓ మెసేజ్ వచ్చింది. అది తన ఫోన్ నెంబర్ నుంచే ఆ మెసేజ్ వచ్చింది. పేరు కూడా తన పేరే ఉంది. దీన్ని చూసి పేటీఎం వ్యవస్థాపకుడు షాక్ అయ్యాడు. తనకు తన పేరుతో తన నెంబర్ లాంటి నెంబర్ నుంచి మెసేజ్ రావడం ఏంటని అనుకున్నాడు. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి తనను ‘విజయ్ శేఖర్ శర్మ’గా పరిచయం చేసుకున్నాడు. అంటే మోసగాడు విజయ్ గుర్తింపును ఉపయోగించి ఆయనకే మెసేజ్ పంపాడు.

Xలో వైరల్

విజయ్ శేఖర్ శర్మ ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, “Impersonating myself to me.” అని రాశారు. అలాగే మోసగాడు అతన్ని “Are you in the office?” అని అడుగుతూ, తనను ‘Vijay Shekhar Sharma’గా పరిచయం చేసుకున్న వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశారు.

సోషల్ మీడియాలో హాస్య ప్రతిస్పందనలు

ఈ పోస్ట్ తర్వాత ఇంటర్నెట్‌లో ప్రతిస్పందనల వరద పారింది. ఒక యూజర్ చమత్కారంగా, కాస్త సాధారణంగా స్పందించవచ్చు కదా అని రాశాడు. మరొకరు తీవ్రంగా, “సరదా విషయం పక్కన పెడితే ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. చాలా మంది ఇలాంటి మోసాలకు బలవుతారు.” అన్నారు. మరొక యూజర్, “ఇంత నమ్మకం కావాలి.” అని వ్యంగ్యంగా అన్నాడు. Paytm గురించి మరొకరు, “అతన్ని అడగండి, Paytm UPIలో ఎంత క్యాష్‌బ్యాక్ వస్తుంది?” అని అన్నాడు. మరొక యూజర్ సినిమా శైలిలో, “విజయ్ విజయ్‌ను పిలుస్తున్నాడు - ‘కార్తిక్ కాల్స్ కార్తిక్’ సినిమాలో లాగా.” అన్నాడు.

వాట్సాప్ మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలి?

వాట్సాప్ ఒక బ్లాగ్‌లో ఇలాంటి మోసాల నుంచి ఎలా తప్పించుకోవాలో వివరించింది. మొదటి దశ ఆగు, ఆలోచించు. ఎవరైనా వేగంగా సమాధానం ఇవ్వమని, నమ్మమని లేదా మీ పిన్, వ్యక్తిగత వివరాలు చెప్పాలని అడిగితే జాగ్రత్తగా ఉండండి.

రెండవ దశలో వాటితో చాటింగ్ వెంటనే ఆపండి.  చాటింగ్ చేస్తున్న వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటే, మాట్లాడటం ఆపమని వాట్సాప్ స్వయంగా చెబుతోంది, “ ఎదుటి వ్యక్తి మీకు తెలియని వ్యక్తి అయితే మాత్రం ఎటువంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకోకండి.” అని అంటోంది. 

మూడవ దశ బ్లాక్ చేసి, నివేదించండి. అలాంటి మోసగాళ్లను వెంటనే బ్లాక్ చేసి, వాట్సాప్‌కు నివేదించండి. అలాగే, మీ గోప్యత, భద్రతా సెట్టింగ్‌లను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేసుకోండి.

ఇలాంటివి సరదాగానే ఉన్నా  ప్రభావం తీవ్రం

విజయ్ శేఖర్ శర్మ ఘటన సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ, మోసగాళ్ళు ఎంత దూరం వెళ్ళగలరో ఇది చూపిస్తుంది. జాగ్రత్తగా ఉండటం,  టెక్నాలెడ్జితో ముందుకు సాగడం అవసరం.