భారత బ్యాడ్మింటన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి((Satwiksairaj Rankireddy-Chirag Shetty) )కొత్త సీజన్‌లో కూడా జోరు కొనసాగిస్తోంది. మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament)లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం వరుసగా రెండో ఏడాది సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌ జోడీ 21-11, 21-8తో చైనాకు చెందిన టింగ్‌ రెన్‌- షియాంగ్‌ జంటను చిత్తుచేసింది. కేవలం 35 నిమిషాల్లోనే విజయాన్ని అందుకున్న సాత్విక్‌ ద్వయం ప్రత్యర్థి జోడీపై తమ విజయాల రికార్డును 2-0తో మెరుగుపరుచుకుంది. మ్యాచ్‌ ఆద్యంతం భారత ఆటగాళ్లు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తొలి గేమ్‌లో వరుసగా ఏడు పాయింట్లు గెలిచిన సాత్విక్‌–చిరాగ్‌ అదే ఊపులో గేమ్‌ను దక్కించుకున్నారు. రెండో గేమ్‌లోనూ భారత జంట దూకుడు కొనసాగించింది. స్కోరు 7–3 వద్ద సాత్విక్‌–చిరాగ్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి 14–3తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.

 

నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్‌ జంట కాంగ్‌ మిన్‌ హైక్‌–సియో సెయుంగ్‌ జే (దక్షిణ కొరియా)తో సాత్విక్‌–చిరాగ్‌ జంట తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సాత్విక్‌–చిరాగ్‌ 3–1తో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో  ద్వయం పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో అశి్వని–తనీషా జంట 15–21, 13–21తో రిన్‌ ఇవనాగ–కీ నకనిషి (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. 

 

చైనా మస్టర్స్‌లో ఓటమి

న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి(Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీకి షాక్‌ తగిలింది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ తుదిపోరులో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆడిన ఆడిన అయిదు ఫైనల్లోనూ వరుస విజయాలు సాధించిన సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి జోడి తొలిసారి తుది మెట్టుపై బోల్తా పడింది. చివరివరకూ పోరాడినా... ప్రతీ పాయింట్‌ కోసం తీవ్రంగా శ్రమించినా ఈ స్టార్‌ జోడీకి ఓటమి తప్పలేదు. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సాత్విక్‌- చిరాగ్‌ జంట 19-21, 21-18, 19-21 తేడాతో చైనాకు చెందిన రెండో సీడ్‌ లియాంగ్‌- వాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో భారత ద్వయం అనవసర తప్పిదాలతో పరాజయం పాలైంది.

 

ఇటీవలే ఖేల్‌రత్న అందుకున్న చిరాగ్‌

కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఖేల్ రత్న, ద్రోణాచర్య, అర్జున అవార్డు (Arjuna Awards 2023)లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి (Chirag Shetty), ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్‌ (Satwiksairaj Rankireddy) లకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)ను ప్రకటించారు. క్రీడల్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 26 మందిని అర్జున అవార్డు వరించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది.