Rishabh Pant on Urvashi Rautela: టీమ్‌ఇండియా వికెట్ కీపర్‌ రిషభ్ పంత్‌ (Rishabh Pant) బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌటెలాపై (Urvashi Rautela) ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టార్‌డమ్‌ కోసం కొందరు క్రికెటర్ల పేర్లను వాడుకుంటున్నారని పరోక్షంగా విమర్శించాడు. 'నన్ను ఒంటరిగా వదిలెయ్‌ చెల్లెమ్మా!' అంటూ అదరిపోయే పంచ్‌ ఇచ్చాడు.


ముంబయి హోటల్లో ఓ క్రికెటర్‌ తనను కలిసేందుకు వచ్చాడని ఊర్వశి రౌటెలా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకు తీరిక లేకపోవడం వల్ల అతడిని కలవలేదని వెల్లడించింది. అతడిని ఆర్పీ అంటూ సంబోధించింది. ఆమె చెప్పింది రిషభ్ పంత్‌ గురించేనని సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. దాంతో చిర్రెత్తుకొచ్చిన పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.




ఊర్వశి, పంత్ 2018 నుంచి వార్తల్లో ఉంటున్నారు. వారిద్దరూ తరచూ కలిసి లంచ్‌కు వెళ్లినట్లు, కలుసుకొన్నట్టు మీడియాలో ఫొటోలు వచ్చేవి. ఆ తర్వాత వాట్సాప్‌లో ఊర్వశిని పంత్‌ బ్లాక్‌ చేశాడని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ కలిసే విడిపోయారని, ఇద్దరూ తమ నంబర్లను బ్లాక్‌ చేసుకున్నారని ప్రచారం జరిగింది.


ఈ మధ్యే బాలీవుడ్‌ హంగామాకు ఊర్వశి ఇంటర్వ్యూ ఇచ్చింది. తనను కలిసేందుకు ఓ క్రికెటర్‌ గంటల తరబడి హోటల్‌ లాబీలో ఎదురు చూశాడని వెల్లడించింది. ఆ మరుసటి రోజు నుంచే మీడియాలో వార్తలు రావడంతో మొదలవుతున్న తమ బంధానికి అడ్డంకులు వచ్చాయని వెల్లడించింది. అతడి పేరు చెప్పకుండా ఆర్పీ అని సంబోధించింది. అతడి పూర్తి పేరేంటో చెప్పాలని అడగ్గా సున్నితంగా నిరాకరించింది. దాంతో అతడు రిషభ్ పంతేనని కొందరు ఊహించుకున్నారు.


ఊర్వశి ఇంటర్వ్యూ తర్వాత రిషభ్ పంత్‌ సోషల్‌ మీడియాలో ఓ నిగూఢ సందేశం పోస్ట్‌ చేశాడు. ఆమెను పరోక్షంగా విమర్శించాడు. ఆమె చెప్పినవన్నీ అవాస్తవాలే అన్నట్టుగా వివరించాడు. 'లేని పాపులారిటీ కోసం వార్తల్లో ప్రధానంగా నిలిచేందుకు కొందరు ఇంటర్వ్యూల్లో అబద్ధాలాడటం చూస్తుంటే నవ్వొస్తోంది. పేరు, ప్రతిష్ఠల కోసం కొందరు ఇలా చేయడం బాధాకరం. వారిని దేవుడు ఆశీర్వదించాలి. నన్ను ఒంటిరిగా వదిలెయ్‌ చెల్లెమ్మా, అబద్ధాలకూ ఓ పరిమితి ఉంటుంది' అని పంత్‌ పేర్కొన్నాడు.