Paris Olympics 2024 India Schedule: విశ్వ  క్రీడల్లో సత్తా చాటేందుకు 117 మందితో కూడిన భారత బృందం పారిస్‌(Paris)లో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య ఇండియా అథ్లెట్లు ఒలింపిక్‌ విలేజ్‌లో కాలు మోపి ప్రాక్టీస్‌ కూడా అరంభించేశారు. నీరజ్‌ చోప్రా దగ్గరి నుంచి అదితి అశోక్‌ వరకూ చాలా మంది అథ్లెట్లపై ఈసారి భారీగా పతక అంచనాలు ఉన్నాయి. విశ్వ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాలని భారత అథ్లెట్లు మంచి పట్టుదలతో ఉన్నారు. ఈసారి పతకాల సంఖ్యను రెండంకెలు దాటించాలని భారత ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. అయితే ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ ఈవెంట్‌లు ఎప్పుడు ఆరంభం అవుతాయి... వాటిని ఎలా చూడాలి... వంటి అంశాలు తెలుసుకుందామా...




 

ప్రారంభం ఎప్పుడంటే..?

పారిస్‌ ఒలింపిక్స్‌లో ఎల్లుండి( శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఫ్రాన్స్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. తొలిసారి స్టేడియం వెలుపల ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం 7.30కు ప్రారంభం కానున్న వేడుకలు మూడు గంటలకుపైగా కొనసాగనున్నాయి. గత సంప్రదాయాలకు భిన్నంగా అథ్లెట్లు స్టేడియంలో కాకుండా.. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ నడిబొడ్డున రివర్ పరేడ్‌లో పాల్గొంటారు. అవుట్‌డోర్‌లో జరిగే ఈ వేడుకలు పారిస్ 2024ని అతిపెద్ద ప్రారంభోత్సవ వేడుకగా మార్చేశాయి. సీన్ నది వెంట అథ్లెట్లు పరేడ్‌ నిర్వహించనున్నారు. అథ్లెట్ల మార్చ్ ఫాస్ట్‌ కోసం ఆరు కిలోమీటర్లు పరేడ్‌ లైన్‌ను సిద్ధం చేశారు. ఆ తర్వాత అధికారికంగా ఒలింపిక్ జ్యోతి వెలిగించడంతో పారిస్ 2024 క్రీడలు అధికారికంగా ప్రారంభమవుతాయి.  ఈ వేడుకల కోసం ఇప్పటికే పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేలమందితో కనివినీ ఎరుగని భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పారిస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

 

భారత్‌ వేట రేపటి నుంచే..

ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకలు అధికారికంగా 26వ తేదీన ప్రారంభం కానుండగా.. ఇండియా పోటీలు మాత్రం ఒక రోజు ప్రారంభం అవుతాయి. జూలై 25నే ఆర్చరీ(Archery)  విభాగంలో భారత పోరాటం ఆరంభం కానుంది. ఆర్చరీ మహిళల ర్యాంకింగ్ రౌండ్ విభాగంలో జూలై 25 మధ్యాహ్నం ఒకటింటింకి ప్రారంభమవుతుంది. జూలై 27, శనివారం న్యూజిలాండ్‌తో ఇండియా మెన్స్‌ టీం తలపడనుంది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్  కూడా 27వ తేదీనే ఆరంభం కానున్నాయి. విశ్వ క్రీడలను స్పోర్ట్స్ 18, వయాకామ్ 18 నెట్‌వర్క్‌ సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. జియో సినిమా యాప్‌లో కూడా ఉచితంగా లైవ్‌ ఇస్తోంది.