Indias Paris Olympics 2024 campaign ends with 6 : పారిస్‌ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో భారత(India) ప్రస్థానం ముగిసింది. ఒక రజతం, అయిదు కాంస్య పతకాలతో విశ్వక్రీడల్లో భారత బృందం తమ పోరాటాన్ని ముగించింది. ఈసారి స్వర్ణ కాంతులు లేకుండానే భారత అథ్లెట్లు వెనుదిరిగారు. కనీసం రెండంకెల పతకాలైన సాధిస్తుందన్న అంచనాలతో పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళ్లిన టీమిండియా అథ్లెట్లు.. అర డజన్‌ పతకాలకే పరిమితమైపోయారు. దీంతో 10 పతకాలకపైగా సాధించాలన్న కల మరో ఒలింపిక్స్‌కు వాయిదా పడింది. టోక్యో వేదికగా జరిగిన గత ఒలింపిక్స్‌లో భారత్‌కు  ఒక స్వర్ణం ఏడు పతకాలు వచ్చాయి. ఒలింపిక్స్‌ చరిత్రలోనే టీమిండియా చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఈసారి కూడా ఆ రికార్డు బద్దలు కాలేదు. ఈసారి పారిస్‌ ఒలింపిక్స్‌లో ఒక పతకం తక్కువగానే భారత పతక ప్రయాణం ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆటల్లో అసలు భారత్‌కు పతకమే దక్కలేదు. బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌లలో క్రీడాభిమానుల అంచనాలు నెరవేరలేదు. దీంతో భారత్‌ కాస్త నిరాశగానే పారిస్‌ నుంచి వెనుదిరిగింది. కాకపోతే నీరజ్‌ సంచలనం, హాకీలో భారత జట్టు 52 ఏళ్ల రికార్డు బద్దలు కొడుతూ కాంస్యం దక్కించుకోవడం...మనూ బాకర్‌ రెండు పతకాలు గెలవడం వంటి మధుర స్మృతులు కూడా భారత్‌ తమ వెంట తీసుకుని రానుంది. 


పతకాల సంఖ్య పెరిగేదా..?
   ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు అదృష్టం కూడా కలిసి రాలేదు. చాలామంది అథ్లెట్లు త్రుటిల్లో పతకాన్ని చేజార్చుకున్నారు. అదీకాకా బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌లో క్లిష్టమైన డ్రా కూడా భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు (Pv Sindhu)క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయింది. మరో బ్యాడ్మింటన్ స్టార్‌ లక్ష్యసేన్‌(Lakshya Sen) సెమీఫైనల్‌ వరకు పోరాడిన కాంస్య పతకపోరులో ఒత్తిడిని తట్టుకోలేక పరాజయం పాలయ్యాడు. ఇక డబుల్స్‌లో భారత పోరాటం  ఇవ్వకుండానే వెనుదిరిగింది. టేబుల్‌ టెన్నిస్‌లో పురుషుల జట్టు పూర్తిగా నిరాశ పర్చగా... మణిక బాత్రా(Manika Batra), ఆకుల శ్రీజ(Akula Srija) నేతృత్వంలోని మహిళల బృందం మాత్రం కాస్త పోరాడింది. శ్రీజ పోరాటం ఈ ఒలింపిక్స్‌లో ఆకట్టుకుంది. బాక్సింగ్‌పైన భారత్‌ భారీ అంచనాలు ఉన్నాయి. లవ్లీనా బోర్గోహైన్‌, నిఖత్‌ జరీన్‌ పోరాడినా వారికి ఓటమి తప్పలేదు. ఎలాగైన పతకం సాధించాలని పట్టుదలగా ఉన్న ఆర్చరీ బృందానికి నిరాశ తప్పలేదు. కనీసం ఒక్క పతకమైన వస్తుందన్న ఆశలు నెరవేరలేదు. ధీరజ్‌ బొమ్మదేవర సహా ఆర్చరీ బృందం ఆరంభంలో కాస్త ఆశలు రేపినా ఆ తర్వాత పరాజయం పాలయ్యారు. కాకపోతే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మనూ బాకర్ నిలవడం కాస్త సంతోషాన్ని ఇచ్చింది. ఒలింపిక్స్‌లో భారత్‌ అర డజన్‌ పతకాలు గెలవడం ఇది రెండోసారి కావడం విశేషం. 2012లోనూ టీమిండియా రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.