శ్రీలంక విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ మెండిస్‌ చెలరేగిపోయాడు. ప్రపంచంలోనే  పటిష్టమైన బౌలింగ్‌ దళంగా పేరొన్ని పాకిస్థాన్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ప్రపంచకప్‌లో ఇంతవరకు ఏ శ్రీలంక బ్యాటర్‌కు సాధ్యంకాని రికార్డు సృష్టించాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కుశాల్‌ మెండిస్‌ వీరవిహారం చేశాడు. కేవలం 65 బంతుల్లోనే  అధ్బుత శకతం సాధించి ఔరా అనిపించాడు. . ఫోర్‌లు, సిక్సర్‌లతో పాకిస్థాన్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కుశాల్‌ మెండిస్‌... 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 122 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక(51) మంచి సహకారం అందించగా కుశాల్‌ మెండిస్‌ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు.

 

కేవలం 65 బంతుల్లోనే కుశాల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న అతడు మరో 25 బంతుల్లోనే శతకం సాధించాడు. 

హసన్‌ అలీ వేసిన 29 ఓవర్‌లో మూడు, నాలుగు బంతులకు వరుసగా రెండు సిక్సర్లు బాదిన కుశాల్.. తర్వాతి బంతికే ఇమాన్‌ ఉల్‌ హక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో శ్రీలంక బ్యాటర్‌ సమరవిక్రమ  కూడా శతకం సాధించాడు. 89 బంతుల్లో 108 పరుగులు సాధించాడు. సమరవిక్రమ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మిగిలిన వాళ్లలో ధనంజయ డి సిల్వ ఒక్కడే 20 పరుగులు మార్కు(25) దాటాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు స్కోరు చేసింది. తద్వారా వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ మీద అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా భారత్ పేరు మీదున్న రికార్డును శ్రీలంక చెరిపేసింది. 2019 ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదువికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.

వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడిగా కూడా కుశాల్ మెండిస్ రికార్డు సృష్టించాడు. మెండిస్ యొక్క 65 బంతుల్లో సెంచరీ చేయగా.. మొత్తంగా ప్రపంచ కప్ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన సెంచరీ. ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ ఐడెన్ మార్‌క్రమ్‌ పేరు మీద ఉంది. ప్రపంచకప్‌లో మార్‌క్రమ్‌  కేవలం 49 బంతుల్లోనే  సెంచరీ చేశాడు. 

 

ప్రపంచకప్‌లో శ్రీలంక ఆటగాళ్ల వేగవంతమైన సెంచరీలు

కుశాల్ మెండిస్ 65 బంతుల్లో  సెంచరీ

కుమార సంగక్కర 70 బంతుల్లో  సెంచరీ

కుమార సంగక్కర 73 బంతుల్లో 

 

ప్రపంచకప్‌లో పాక్‌ మీద అత్యధిక పరుగులు చేసిన జట్లు

►2023: శ్రీలంక- 344/9- హైదరాబాద్‌లో

►2019: టీమిండియా- 336/5 - మాంచెస్టర్‌లో

►2019: ఇంగ్లండ్‌- 334/9- నాటింగ్‌హాంలో

►2003: ఆస్ట్రేలియా 310/8- జొహన్నస్‌బర్గ్‌లో..

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మీద ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ చేరారు. 2019లో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు జో రూట్‌ 107, జోస్‌ బట్లర్‌ 103 పరుగులతో పాకిస్థాన్‌పై శతకాలు సాధించారు.