Kane Wlilliamson: భారత్‌తో జరుగుతున్న చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం దుబయ్‌లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో  న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెకండ్ ఇన్నింగ్స్ కు దూరం అయ్యాడు. బ్యాటింగ్ సమయంలో గాయం కావడంతో కేన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు దూరం కావలసి వచ్చింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో కేన్ ఆడటం లేదు- న్యూజిలాండ్ క్రికెట్ టీమ్

కేన్ విలియమ్సన్ ఈ సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.  ICC Champions Trophy 2025 ఫైనల్‌లో అతని మీద అంచనాలు కూడా చాలా ఎక్కువుగా  ఉన్నాయి. ఇండియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 81పరుగులు చేసిన కేన్  ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ లో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేశాడు. రెండు వరస మ్యాచ్‌లో పాత కేన్‌ ను గుర్తుకు తెచ్చిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్‌ ఫైనల్‌లో మాత్రం నిరాశ పరిచాడు. పెద్దగా పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. ఫైనల్‌ లో 13వ ఓవర్లో ఇండియన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  14 బంతుల్లో ఒక ఫోర్తో కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కులదీప్ ఆఫ్ స్టంప్‌కు దూరంగా వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడిన కేన్ కొంచం వేగంగా స్పందించాడు. దీంతో కులదీప్‌కు దొరికిపోయాడు. ఫైనల్‌లో జట్టు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో ఔటవ్వడంతో అతను తీవ్రంగా నిరాశ చెందాడు. అవుటైన తర్వాత అతని ఫ్రస్టేషన్ లుక్‌లోనే ఎంతగా నిరాశ చెందాడో తెలిస్తోంది.

అయితే తక్కువ పరుగులతో టీమ్ మేనేజ్‌మెంట్‌ను నిరాశకు గురిచేసిన అతని నుంచి మరో వార్త వచ్చింది.  బ్యాటింగ్ చేస్తున్నప్పుడు .. తొడ కండరాలు పట్టేయడంతో అతను కదలడం కష్టమైంది. దీంతో ఇతను సెకండ్ ఇన్నింగ్స్‌లో  ఆడటం కష్టమైంది. ఇతని స్థానంలో మార్క్ చాప్‌మెన్ ను తీసుకున్నారు. కేన్ స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు. న్యూజిలాండ్ టీమ్‌లో అద్భుతమైన ఫీల్డర్ కూడా. కేన్ ఆడకపోవడం ఆ టీమ్‌కు ఇబ్బంది. కేన్ విలియమ్సన్ చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం లేదు. బ్యాటింగ్ సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో కేన్ దూరంగా ఉంటున్నాడు. అతని స్థానాన్ని మార్క్ చాఫ్‌మన్ భర్తీ చేస్తాడు అని న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది.

కేన్ విలియమ్సన్ తన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు – నాసిర్ హుస్సేన్

 న్యూజిలాండ్ జట్టు చాంఫియన్స్ ట్రోఫీలో చాలా బలంగా ఉందని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. స్కై స్పోర్ట్స్ ఛానల్‌తో అతను మాట్లాడుతూ రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంటర్ వంటి మ్యాచ్‌ విన్నర్‌లు ఆ జట్టులో ఉన్నారు. వీళ్లంతా కచ్చితంగా ఫైనల్‌గా బాగా ఆడేందుకు ప్రయత్నిస్తారు. ఇండియా కూడా అదే భావిస్తుంటుంది అన్నాడు

వాళ్ల టీమ్ చాలా బలంగా ఉంది. టాప్ ఆర్డర్‌లో రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. రావల్పిండిలో బంగ్లాదేశ్‌పై అతను చేసిన సెంచరీ చూశాను. అది నేను మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను అతని ఆటను చూడలేదు. కేవలం రన్స్ చేయడం మాత్రమే కాదు. క్రీజ్ లో అతని కదలికలు కూడా అద్భుతంగా ఉన్నాయి. చాలా సేపు క్రీజ్‌లో నిలుస్తున్నాడు కూడా.. అని నాసిర్ అన్నాడు

“ఐసీసీ ఈవెంట్లలో అతనికి ఐదు సెచరీలు ఉన్నాయి. అతను చాలా తక్కువ మ్యాచ్‌లలోనే ఈ ఘనత సాధించాడు. శాంటర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ.. సత్తా చాటుతాడు. ఫిలిప్స్ ఫీల్డింగ్ అదరగొడుతున్నాడు. ఇక విలియమ్సన్ ఎలాగూ ఉండనే ఉన్నాడు అతను తన కెరీర్‌లోనే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడిప్పుడు. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు వీళ్లందరూ కలిసి తమలోని బెస్ట్ పర్‌ఫార్మెన్స్‌ ను బయటకు తెస్తారు. భారత్‌ను ఓడించడానికి తమ శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించడమే కాదు. ఆ పని చేయగలరు కూడా. ఈ విషయం ఇండియాకు కూడా తెలుసు. ఇండియా టీమ్ కూడా న్యూజిలాండ్ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుందని భావిస్తుంది.