Big News on Slow Over Rate in Ipl 2025: ఐపీఎల్ 2025 ప్రారంభం కాబోతోంది. మరొక్క రోజులో ఈ మెగా వేడుకకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటికే అభిమానులను వేధిస్తున్న ప్రశ్నలకు బీసీసీఐ తాజాగా సమాధానమిచ్చింది. కొన్ని కీలకమైన మార్పులతో ఈసారి ఐపీఎల్ మరింత రంజుగా ఉండబోతోంది. ఈసారి ఎడిషన్ లో కీలకమైన మార్పు.. సలైవాను ఉపయోగించడం. బంతిపై ఉమ్మిని రాసి, దాన్ని షైన్ అయ్యేలా చేసి, రివర్స్ స్వింగ్ కు చేసేందుకు ఆటగాళ్లు ప్రయత్నిస్తారు. 2020 మేలో కోవిడ్ సందర్బంగా ఈ వెసులుబాటును నిషేధించారు. ఇక 2022 నుంచి ఐసీసీ శాశ్వతంగా ఈ ప్రయత్నాన్ని నిషేధించింది. అయితే ఇప్పుడు కోవిడ్ పరిస్థితులు లేకపోవడంతో ఈ వెసులుబాటును కల్పించాలని తాజాగా నిర్వహించిన ఐపీఎల్ కెప్టెన్ల మీటింగ్ లో నిర్ణయించారు. దీని ద్వారా బౌలర్లకు చాలా వెసులుబాటు కలుగుతుందని, కొంతమేర బ్యాటర్లను నిరోధించే అవకాశముంటుందని పేర్కొంటున్నారు. అలాగే మరో రెండు నిర్ణయాలపై కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఇంపాక్ట్ ప్లేయర్ పై..
ఐపీఎల్లో వినూత్నమైన నిర్ణయం ఇంపాక్ట్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీని ద్వారా ఒక జట్టు 12 మంది ఆటగాళ్లతో ఆడేందుకు ఉపకరిస్తుంది. 2023లో టోర్నీలో తొలిసారి దీన్ని ప్రవేశపెట్టగా, ఈ సారి కూడా దీన్ని కొనసాగించనున్నారు. దీనిపై విదేశీ మాజీ ఆటగాళ్ల నుంచి కాస్త వ్యతిరేకత ఎదురైనా, బోర్డు దీనిపై ముందుకు పోవడానికే నిర్ణయించింది. ఈ నిబంధన ప్రకారం.. జట్టులో ఒక అదనపు ప్లేయర్ ను ఏ క్షణమైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే మ్యాచ్ కు ముందరే ఐదుగురు ఆటగాళ్లతో కూడిన జాబితాను అందించాలి. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. ఇక స్లో ఓవర్ రేట్ పైనా గేమ్ చేంజింగ్ డెసిషన్ తీసుకుంది.
ఇకపై అలా ఉండదు..
ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ చాలా ఫ్రాంచైజీలను ఇబ్బంది పెడుతోంది. నిర్ణీత సమయంలోగా బౌలింగ్ పూర్తి చేయలకేపోతే వివిధ రకాలుగా పెనాల్టీలను ఆయా జట్లు ఎదుర్కొంటున్నాయి. మ్యాచ్ ఫీజులో కోతతోపాటు 19వ ఓవర్ నుంచి 30 గజాల సర్కిల్ ఆవతల కేవలం నలుగురు ప్లేయర్లను ఉంచడం, అలాగే పదే పదే ఈ తప్పిదానికి పాల్పడితే ఆయా జట్టు కెప్టెన్లపై మ్యాచ్ నిషేధం కూడా పడుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్ తొలి మ్యాచ్ కు నిషేధం కారణంగా అందుబాటులో ఉండటం లేదు. అయితే తాజాగా నిషేధంపై బోర్డు వెనక్కి తగ్గింది. ఇకపై స్లో ఓవర్ రేట్ మిస్టేక్ చేసినా, నిషేధం వంటివేమీ ఉండబోవని తేల్చింది. ఇక ఐపీఎల్ 2025 ఈనెల 22న కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.