Sunil Gavaskar Says Selectors Have Eye On Riyan Parag: ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్‌ బ్యాటర్‌ రియాన్ పరాగ్‌(Riyan Parag).. టీ 20 ప్రపంచకప్‌(T20 world Cup) జట్టులో స్థానం సంపాదించుకునే దిశగా పయనిస్తున్నాడు. అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతూ సెలెక్టర్లకు, కెప్టెన్‌కు హెచ్చరికలు పంపుతున్నాడు. ఐపీఎల్‌ ఆరంభానికి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో కూడా లేని రియాన్‌ పరాగ్‌.. టోర్నీ మొదలయ్యాక  రేసులోకి దూసుకొచ్చేశాడు. ధనాధన్‌ బ్యాటింగ్ తో రేసులో ఇప్పుడు అందరికన్నా ముందున్నాడు. ప్రతి సీజన్ తన యాటిట్యూడ్‌తో వార్తల్లో నిలిచి ట్రోలర్స్ చేతికి దొరికిపోయే రియాన్ పరాగ్.... ఈ సీజన్‌లో మాత్రం బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తూ చెలరేగిపోతున్నాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రియాన్ పరాగ్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఐదు మ్యాచులాడిన రియాన్ పరాగ్.. 261 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 87.00. స్ట్రైక్ రేట్ 158. ఈ లెక్కలు చూస్తుంటేనే అర్ధమవుతుంది రియాన్‌ ఎలా దుమ్మురేపుతున్నాడో. ఈ క్రమంలోనే రియాన్‌పై సునీల్‌ గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.


గవాస్కర్‌ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్న రియాన్ పరాగ్‌  ఇటీవ‌ల ముగిసిన దేశ‌వాళి టోర్నమెంట్‌లోనూ రాణించాడు. టీ20 ఫార్మాట్‌లో గ‌త 15 ఇన్నింగ్స్‌ల్లో 170.7 స్ట్రైక్‌రేటుతో 90కి పైగా స‌గ‌టుతో 771 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. రియాన్‌ భీకర ఫామ్‌లో ఉండడంతో సెలెక్టర్లకు దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ కీలక సూచన చేశాడు. సెల‌క్షన్ క‌మిటీ అత‌డి పై ఓ క‌న్నేసి ఉంచాలని సూచించాడు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో 10 హాఫ్ సెంచ‌రీలు చేసిన రియాన్‌ పరాగ్‌ను విస్మరించవద్దని గవాస్కర్‌ సూచించాడు.  
గ‌త 15 ఇన్నింగ్స్‌లో ప‌రాగ్ పరుగులు
45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా పది అర్ధశ‌త‌కాలు ఉన్నాయి


రాజస్థాన్‌కు తొలి ఓటమి
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్థాన్‌ జైత్రయాత్రకు గుజరాత్‌ బ్రేక్‌ వేసింది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గుజరాత్‌ చివరి బంతికి విజయం సాధించింది. గెలుపు ఆశలు పూర్తిగా ఆవిరైనా చివరి వరకూ పోరాడిన గుజరాత్‌.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి బౌండరీ కొట్టి విజయాన్ని అందుకుంది. వర్షం కారణంగా ఆలస్యమైన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌... రియాన్‌ పరాగ్‌, సంజు శాంసన్‌ రాణించడంతో  నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌... శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో చివరి బంతికి విజయం సాధించింది.