IPL 2025 SRH VS RR Live Updates: ఐపీఎల్ 2025 లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ శుభారంభం చేసింది. ఆదివారం ఉప్ప‌ల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో 44 ప‌రుగుల‌తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత ఇషాన్ కిష‌న్ సెంచరీ (47 బంతుల్లో 106, 11 ఫోర్లు, 6 సిక్స‌ర్లు)తో చెల‌రేగ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల‌కు 286 ప‌రుగులు చేసింది. బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్ పాండేకి మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేద‌న‌లో రాయ‌ల్స్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 242 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 70, 5 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), సంజూ శాంస‌న్ (37 బంతుల్లో 66, 7 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) కీల‌క‌మైన ఇన్నింగ్స్ ఆడారు. బౌల‌ర్ల‌లో స‌మ‌ర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ కు రెండేసి వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో ఎస్ఆర్ హెచ్ ఆడిన తొలి మ్యాచ్ లోనే బోణీ చేసిన‌ట్ల‌య్యింది.

పోరాడిన శాంసన్..కెప్టెన్సీకి దూరమైనప్ప‌టికీ, ఈ మ్యాచ్ లో సంజూ శాంస‌న్ బాధ్య‌త‌గా ఆడాడు. భారీ టార్గెట్ ఛేద‌న‌లో ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (1), కెప్టెన్ రియాగ్ ప‌రాగ్ (4), నితీశ్ రాణా (11) త్వ‌ర‌గా ఔటైన‌ప్పటికీ ధ్రువ్ జురెలో తో క‌లిసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్లు ప‌డినా ఏమాత్రం వెర‌వ‌కుండా వీరిద్ద‌రూ ఎదురుదాడికి దిగి మూడో వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. బ్యాటింగ్ కు స్వ‌ర్గ‌ధామమైన ఈ పిచ్ పై బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొంటూ 111 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈక్ర‌మంలో కేవ‌లం 26 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకుని సంజూ త‌డాఖా చూపించాడు. చేతి వేలి గాయం నుంచి కోలుకుంటున్న‌ప్ప‌టికీ, బ్యాటింగ్ పై ఆ ప్ర‌భావం ప‌డ‌కుండా స్వేచ్ఛ‌గా ఆడాడు. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో శాంస‌న్ ఔట‌య్యాడు. ఇక జురెలో కూడా స‌న్ బౌల‌ర్ల‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపి 28 బంతుల్లోనే ఫిఫ్టీ స్కోరు చేశాడు. వీరిద్ద‌రూ రెండు బంతుల వ్య‌వ‌ధిలో ఔట్ కావ‌డం రాయ‌ల్స్ ను దెబ్బ తీసింది. 

పోరాడిన హెట్ మెయ‌ర్..ఐదు వికెట్లు ప‌డి, అప్ప‌టికే ఓట‌మి ఖ‌రారైన‌ప్ప‌టికీ హెట్ మెయ‌ర్ (42) ప‌ట్టు విడ‌వ‌లేదు.  ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గించాల‌ని , తద్వారా నెట్ ర‌న్ రేట్ ను మెరుగు ప‌ర్చే ఉద్దేశంతో త‌ను బ్యాటింగ్ చేశాడు. త‌న‌కు శుభ‌మ్ దూబే (34 నాటౌట్) నుంచి చ‌క్క‌ని స‌హ‌కారం అందింది. వీరిద్ద‌రూ చాలా వేగంగా ప‌రుగులు సాధించ‌డంతో ఓట‌మి అంత‌రం బాగా త‌గ్గింది. మిగతా బౌల‌ర్లలో మ‌హ్మ‌ద్ ష‌మీ, ఆడ‌మ్ జంపాకు త‌లో వికెట్ ద‌క్కింది. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా ఆడ‌మ్ జంపా ఆడాడు. ఈ మ్యాచ్ లో 76 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న జోఫ్రా ఆర్చ‌ర్.. ఐపీఎల్ ల్లో అత్య‌ధిక ప‌రుగులిచ్చిన పేస‌ర్ గా మోహిత్ శ‌ర్మ (73)ను వెన‌క్కినెట్టాడు .  అలాగే రాజ‌స్తాన్ త‌ర‌పున య‌జ్వేంద్ర చాహ‌ల్ (62) పేరిట ఉన్న అత్య‌ధిక ప‌రుగులిచ్చిన చెత్త‌ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ కు ఇషాన్ తో పాటు ట్రావిస్ హెడ్ (67), హెన్రిచ్ క్లాసెన్ (34) రాణించడంతో భారీ స్కోరుు దక్కింది. ఒక దశలో 300+ పరుగులు సాధిస్తారునకున్నా, కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో ఆ రికార్డు దక్కలేదు. అయితే టోర్నీలో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.  ఇక త‌ర్వాత మ్యాచ్ ను స‌న్ రైజ‌ర్స్ ఇదే వేదిక‌పై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో ఆడుతుంది.