KKR vs SRH Head To Head Records IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL 2024)లో అసలు సిసలు యుద్ధం మొద‌లుకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(KKR), స‌న్‌రైజ‌ర్స్ హైద్రాబాద్‌(SRH)తో త‌ల‌ప‌డ‌నుంది. మంగళవారం (మే 21) రాత్రి 7.30 నిమిషాల‌కు ఈ మ్యాచ్‌ మెద‌లుకానుంది. ఐపీఎల్‌లో ఈ  రెండు జట్లు టైటిల్స్‌ సాధించాయి. ఈసారి కొత్త కెప్టెన్‌, భారీ హిట్టర్లతో హైదరాబాద్ ధీమాగా ఉంది. అయితే టైటిల్ గెలిచి ఏళ్లు గ‌డ‌వ‌డం,  ప్రతీ ఏడాది క‌ప్ ఆశ‌ల‌తో టోర్నీలోఅడుగుపెట్టడం...కానీ, రిక్త హ‌స్తాల‌తో వెనుదిరిగి రావ‌డంతో ఈ రెండు జట్లకే నిరాశే మిగిలింది. కానీ ఈసారి రెండు జట్లు భీకరంగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో దుమ్ము దులుపుతున్నాయి. ప్రస్తుత సీజ‌న్‌లో మ‌రోసారి క‌ప్ ఆశ‌ల‌తో టోర్నీలో అడుగుపెట్టిన వీరి  బ‌లాబ‌లాలు ఏంటి? వీరిద్దరి మ‌ధ్య రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ టీమ్‌లో టాప్ ఆట‌గాళ్లు ఎవ‌రు లాంటి వివ‌రాలు చూద్దాం..


రికార్డులు వారివైపే
ఇరుజ‌ట్ల మ‌ధ్య మొత్తం 26 మ్యాచ్‌లు జ‌ర‌గ్గా కోల్‌క‌తా 17 మ్యాచ్‌లు గెలుపొంద‌గా, స‌న్‌రైజ‌ర్స్ కేవ‌లం 9 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. గ‌త 2023 సీజ‌న్‌లో చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ సీజన్‌లోనూ హైదరాబాద్‌పై కోల్‌కత్తా విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. 200కుపైగా పరుగులు నమోదైన  ఆ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కానీ కోల్‌కత్తానే విజయం సాధించింది.  త‌ట‌స్థ వేదిక‌ల మీద కూడా కోల్‌క‌తా నైట్‌రెడర్స్ జ‌ట్టు ఆధిప‌త్యం సాగింది. తటస్థ వేదికల్లో ఇరు జ‌ట్లు 9 మ్యాచ్‌ల్లో ఢీకొన‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు 6 విజ‌యాలు సాధించింది. మ‌రోవైపు హైద్రాబాద్ 3 విజ‌యాలు సాధించింది. మ‌రో 3 మ్యాచ్‌ల‌ను కోల్పోయింది. ఇలా ఎటుచూసినా గ‌ణాంకాలు హైదరాబాద్‌ని కోల్‌క‌తా స‌మ‌ర్ధవంతంగా నిలువ‌రించింది. 


భువనేశ్వరే టాప్‌
ఇక ఇరుజ‌ట్ల త‌రుఫున ఆటగాళ్ల రికార్డుల ప‌రంగా చూస్తే డేవిడ్ వార్నర్ 619, నితీష్ రాణా 483, మ‌నీష్‌పాండే 438 ప‌రుగుల‌తో అత్యధిక ప‌రుగువీరులుగా ఉన్నారు. ఇక బౌలింగ్ విష‌యానికొస్తే భువ‌నేశ్వర్ కుమార్ 24 వికెట్లు, ర‌స్సెల్ 17, ఉమేష్ యాద‌వ్ 12 వికెట్ల‌తో వికెట్ల వీరులుగానిలిచారు. . ఈసారి క‌ప్పు వేట‌లో ఉన్నామని ఇప్పటికే చాటిచెప్పిన రైజ‌ర్స్‌ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. 


ఆపడం కష్టమే
స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఈ సారి చాలాబ‌లంగా క‌నిపిస్తోంది. ఈ సారి వేలంలో 20.50 కోట్లు పెట్టి కొన్న పాట్‌ క‌మిన్స్ కెప్టెన్‌గా జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. మ‌రోవైపు భువ‌నేశ్వర్‌, న‌ట‌రాజ‌న్‌, ఉనద్కత్‌, మార్కో జ‌న్‌సేన్‌, ఉమ్రాన్‌మాలిక్ ల‌తో పేస్ బౌలింగ్ బ‌లంగా ఉంది. బ్యాటింగ్‌లో హెడ్‌, అభిషేక్‌ శర్మ, మార్క్రమ్‌, క్లాసెన్‌ , గ్లెన్ ఫిలిప్స్ ఉండ‌డంతో రైజ‌ర్స్ ఈసారి టోర్నీపై భారీ ఆశ‌లు పెట్టుకొంది.