పంజాబ్ కింగ్స్తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన బౌలర్గా అర్జున్ టెండూల్కర్ నిలిచాడు. ఈ సీజన్లో లీగ్ స్టేజీలో లక్నో జట్టుకు అదే చివరి మ్యాచ్ కాగా, సీజన్లో అర్జున్ టెండూల్కర్ ఆడిన తొలి, ఏకైక మ్యాచ్ ఇదే. ముంబై ఇండియన్స్ నుండి లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వెళ్లిన తర్వాత, జట్టు వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ అర్జున్కు ఈ సీజన్లో అవకాశాలు రాకపోవడంతో బెంచ్కే పరిమితమయ్యాడు. చివరి మ్యాచులో ఛాన్స్ రావడంతో అర్జున్ రాణించడంపై సచిన్ హర్షం వ్యక్తం చేశారు.
చివరి మ్యాచ్ వరకూ వెయిట్ చేసిన అర్జున్ టెండూల్కర్
అయితే, ఎట్టకేలకు ఐపీఎల్ 2026 లీగ్ దశలో లక్నో ఆడిన చివరి మ్యాచ్లో అతనికి అవకాశం లభించింది. బంతితో అర్జున్ రాణించి, తనదైన ముద్ర వేశాడు. ఈ మ్యాచ్ తర్వాత, అర్జున్ తండ్రి, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుత్రోత్సాహానికి లోనయ్యాడు. కుమారుడు అర్జున్ ప్రదర్శనను మాత్రమే కాకుండా అతని ఓర్పు, పట్టుదలను ప్రశంసిస్తూ ఒక మెస్సేజ్ పంచుకున్నారు. అవకాశం కోసం వేచి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం, హార్డ్ వర్క్ చేయడం, సీజన్ పొడవునా తన సామర్థ్యాలను నమ్మినందుకు కుమారుడు అర్జున్ను సచిన్ అభినందించారు.
అవకాశాలు రాకున్నా పాజిటివ్గా ఉన్నావు.. సచిన్ పోస్ట్
పంజాబ్తో జరిగిన మ్యాచులో లక్నో ఓడినప్పటికీ అర్జున్ టెండూల్కర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. దాంతో మ్యాచ్ పూర్తయ్యాక సచిన్ ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘వెల్ డన్ అర్జున్. ఈ సీజన్ మొత్తం నువ్వు నిన్ను మలుచుకున్న విధానం చూసి గర్వంగా ఉంది. నీ సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ నమ్ముతూ, ఓపికగా ఉండాలి. నిరంతరం శ్రమిస్తూ చివరి మ్యాచ్ వరకు అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చినప్పటికీ పాజిటివ్గా ఉన్నావు. క్రికెట్ నీ నైపుణ్యాన్ని ఎంతగా పరీక్షిస్తుందో, నీ ఓర్పును కూడా అంతగా పరీక్షిస్తుంది. ఈ రోజు ఆ రెండింటినీ చాలా చక్కగా హ్యాండిల్ చేశావు. ఎప్పుడూ ఇలాగే ఒదిగి ఉండు. ఎప్పటిలాగే ఈ ఆటను మాత్రం ప్రేమిస్తూనే ఉండు. లవ్ యూ ఆల్వేస్’ అని సచిన్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు.
పంజాబ్తో మ్యాచులో రాణించిన అర్జున్ పంజాబ్ (PBKS), లక్నో (LSG) మధ్య జరిగిన మ్యాచ్లో పవర్ప్లే పూర్తయిన వెంటనే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. అతను వేసిన ఒక బౌన్సర్తో పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ను ఇబ్బంది పెట్టి వికెట్ తీసే అవకాశాన్ని క్రియేట్ చేశాడు. అయితే, కీపర్ రిషబ్ పంత్ ఆ సులువైన క్యాచ్ను వదిలివేయడంతో, మొదటి స్పెల్లో అర్జున్కు వికెట్ దక్కే అవకాశం చేజారింది. ఒకవేళ పంత్ ఆ క్యాచ్ పట్టి ఉంటే ప్రభ్ సిమ్రన్ త్వరగా ఔట్ కావడంతో పంజాబ్ మీద ఒత్తిడి పెరిగేది. ఈ మ్యాచులో ప్రభ్ సిమ్రన్ (39 బంతుల్లో 69, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తో చెలరేగాడు. శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
చివరకు ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఒక అద్భుతమైన యార్కర్తో ప్రభ్సిమ్రన్ సింగ్ను ఎల్బిడబ్ల్యూ (LBW) గా అవుట్ చేసి వికెట్ తీశాడు. అర్జున్ తన నాలుగు ఓవర్లలో 1/36 తో పరవాలేదనిపించాడు. కేవలం 9 ఎకానమీ రేటుతో బౌలింగ్ కోటా పూర్తి చేయగా.. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్లందరిలో ఎకానమీలో ఇదే బెస్ట్ బౌలింగ్.
లక్నో పేసర్ మహ్మద్ షమీ నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇవ్వగా, ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లలో 10 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో 32 పరుగులు ఇచ్చాడు. మోహ్సిన్ ఖాన్ తన 4 ఓవర్ల స్పెల్లో 48 పరుగులు సమర్పించుకోగా, స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాఠీ 3 ఓవర్లలో 13 ఎకానమీతో పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్గా నిలిచాడు.
