Rishabh Pant Slapped With 1 Match Ban and  Hefty Fine : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)) జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది.  ఈ నిర్ణయంతో ప్లేఆఫ్స్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌ తగిలింది. డీసీ జట్టు ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్‌ రేట్‌కు పాల్పడగా, గత మంగళవారం రాజస్థాన్‌పై కూడా పునరావృతమైంది. దీంతో ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు పంత్‌కు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. అలాగే ఇతర ఆటగాళ్లు కూడా రూ.12 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజులో 50శాతం.. వీటిలో ఏది తక్కువైతే దానిని ఫైన్‌గా కట్టాల్సి ఉంటుందని పాలకమండలి వెల్లడించింది. మరోవైపు ఢిల్లీ జట్టు మ్యాచ్‌ రెఫరీ నిర్ణయాన్ని సవాల్‌ చేసినా ఫలితం లేకపోయింది. కాగా ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్‌కు పంత్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. . దీంతో ఇవాళ్టీ మ్యాచ్‌లో పంత్ లేకుండానే ఢిల్లీ బరిలోకి దిగనుంది. 



తొలి ఆటగాడు పంతే
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఒక మ్యాచ్‌ వేటుపడిన తొలి ఆటగాడు రిషభ్‌ పంత్‌. కీలక దశలో ఆడే అవకాశం లేకపోవడంతో ఢిల్లీ ప్లేఆఫ్స్‌ ఛాన్స్‌లు ప్రమాదంలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. బెంగళూరుతో కాకుండా లక్నోతో మే 14న ఢిల్లీ తలపడనుంది. 


కీలక మ్యాచ్‌లో పాపం ఇలా...
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో వరుసగా ఐదో విజయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కన్నేసింది. ఈ సీజన్‌ను ఓటములతో ఆరంభించిన బెంగళూరు రెండో అర్ధ భాగంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. వరుసగా నాలుగు విజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంటూ వస్తోంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిచి బెంగళూరు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. విరాట్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ 47 బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. దీంతో పంజాబ్‌ను 60 పరుగులతో చిత్తు చేసిన బెంగళూరు... ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీకి షాక్‌ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కూడా గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పుంజుకుంది. గత మ్యాచ్‌లో పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌ను ఢిల్లీ ఓడించింది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్ చెలరేగిపోతున్నారు. ఇప్పుడు బెంగళూరుపై అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఢిల్లీ చూస్తోంది.