అహ్మదాబాద్:  ఎట్టకేలకు ఐపిఎల్ లో కొత్త చాంపియన్ ను చూడబోతున్నాం. ఈరోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ లేదా RCB ఎవరు గెలిచినా అది ఒక కొత్త చరిత్రనే. ఐపీఎల్ ప్రారంభమై 18 ఏళ్లు గడిచినా ఇంతవరకు ఈ రెండు టీమ్ లు కప్ గెలిచింది లేదు. కానీ ఇప్పుడు కూతవేటు దూరంలో తొలి IPL కప్ ఈ రెండు టీం లను ఊరిస్తోంది. 

RCB - మ్యాచ్ విన్నర్ లతో నిండిన జట్టు

 18 ఏళ్లుగా ఒకే టీమ్ కు ఆడుతూ ఆ టీం కి సింబల్ గా మారిపోయిన ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ కి ఎలాగైనా తొలి కప్పు అందించాలని ఆ టీమ్ మొత్తం పోరాడుతోంది. వాళ్లలో ఆ కసి గ్రౌండ్లో క్లియర్ గా కనబడుతోంది. అయితే మిగిలిన సిజన్ లతో పోలిస్తే ఈ సారి జట్టు లో కనపడుతోన్న ప్రధాన మైన తేడా విరాట్ పై భారం తగ్గించడం. గతంలో మొత్తం టీం బ్యాటింగ్ భారం విరాట్ పైనే ఉండేది. మధ్యలో క్రిస్ గేల్,ఏబీ డీ, ఫించ్,మాక్స్ వెల్, KL రాహుల్ లాంటి వాళ్లు కొన్ని వేరు వేరు సీజన్ లలో మెరిసినా  ఒత్తిడి మొత్తం విరాట్ పైనే ఉండేది. కానీ ఈసారి సీన్ మారింది. గెలిచిన 9 గేమ్ ల్లో మొత్తం తొమ్మిది మంది వేరు వేరు ప్లేయర్ లు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు పొందారంటేనే ఈసారి ఆర్సిబి ఎలా ఆడుతోందో చెప్పొచ్చు. సాల్ట్, జితేష్, పటిదార్, కోహ్లీ,టిమ్ డేవిడ్, హెఙల్ వుడ్, మయాంక్ అగర్వాల్, భువి,కృనాల్, సుయాష్ శర్మ, యష్ దయాల్ ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలను గ్రౌండ్లో పక్కాగా నిర్వహిస్తున్నారు. ఈసారి పక్కాగా "ఈ సాలా కప్ నెమ్దే " అంటున్నారు బెంగళూరు ఫ్యాన్స్.

పంజాబ్ - టీమ్ ప్లే కి పెట్టింది పేరు 

 స్టార్ల కంటే టీం ప్లేను నమ్ముకున్న జట్టుగా  పంజాబ్ సారి ఫైనల్ కు దూసుకొచ్చింది. కెప్టెన్  శ్రేయస్ అయ్యర్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. తను కెప్టెన్గా 3 వేరువేరు జట్లను ఐపీఎల్ ఫైనల్ కు తీసుకొచ్చిన ఘనత తనదే. తనతో పాటు జోష్ ఇంగ్లీష్,నేహాల్ వదేరా, ప్రబ్ సిమ్రాన్ సింగ్,ప్రియంశు ఆర్య, మార్కస్ స్టోయిన్స్, చాహల్, అర్షదీప్ సింగ్ లాంటి వాళ్ళు కలిసికట్టుగా ఆటడంతో టైటిల్ ఫేవరెట్లను ఓడిస్తూ  ఫైనల్ కు. చేరుకుంది పంజాబ్ జట్టు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత తొలిసారి  ట్రోఫీని  తమ జట్టు కైవసం చేసుకుంటుందని పంజాబ్ ఫ్యాన్స్  లెక్కలు వేసుకుంటున్నారు.

ఒత్తిడే అసలు విలన్

 ఎలాంటి జట్టయినా ఫైనల్ అనగానే ఒత్తిడి పెరిగిపోతోంది. దానికి ఎవరూ అతీతులు కాదు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నా.. అభిమానుల మద్దతు ఎంత ఉన్నా.. ఎవరైతే ఫైనల్ ఆ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటారో  వారే ఈసారి ఐపీఎల్ లో  కొత్త ఛాంపియన్గా అవతరిస్తారు. ఇంతవరకూ ముంబై, చెన్నై చెరొక 5 టైటిళ్లు గెలిచాయి. కోల్కతా 3, SRH 1,రాజస్థాన్ 1, డెకన్ ఛార్జర్స్ 1,గుజరాత్ 1 ట్రోఫీ గెలిచిన టీమ్స్ లో ఉన్నాయి. మరి RCB, పంజాబ్ లలో ఏ టీమ్ ఈ లిస్ట్ లో చేరుతుందో కాసేపట్లో తేలిపోతుంది.