RCB vs LSG IPL  2024 Lucknow Super Giants won by 28 runs: ఐపీఎల్‌(IPL)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) పరాజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో(LSG)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఘోర పరాజయం పాలైంది. క్వింటన్‌ డికాక్‌ ఒంటరి పోరాటంతో లక్నో తొలుత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు... లక్నో బౌలర్ల ధాటికి కకావికలమైంది. 153 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు ఖాతాలో మరో ఓటమి చేరింది. బెంగళూరు బ్యాటర్ల వైఫల్యంతో ఘోర పరాజయం  పాలైంది. 


మ్యాచ్‌ సాగిందిలా...
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బెంగళూరు (RCB)... లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గత రెండు మ్యాచుల్లో విఫలమైన ఆర్సీబీ బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించారు. రీస్‌ టాస్లీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో డికాక్‌ మూడు ఫోర్లు కొట్టాడు. సిరాజ్‌ బౌలింగ్‌లోనూ వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన డికాక్‌... బెంగళూరు బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాక్‌వెల్‌ వేసిన ఆరో ఓవర్‌లో లక్నో సారధి కే.ఎల్‌. రాహుల్‌ అవుటయ్యాడు. దీంతో 54 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్‌ కోల్పోయింది. పవర్ ప్లే పూర్తయ్యే సరికి బెంగళరు 54 పరుగులు చేసింది.


మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న డికాక్ 


ఈ మ్యాచ్‌లో డికాక్‌ ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. డికాక్‌ ఒంటరి పోరాటంతో లక్నో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 84 పరుగులు చేసింది. ఈ క్రమంలో క్వింటన్‌ డికాక్‌ 36 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో 22వ అర్థ శతకాన్ని డికాక్‌ పూర్తి చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ వేసిన 13 ఓవర్‌లో  డికాక్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదాడు. మాక్స్‌ వెల్‌ బౌలింగ్‌లో స్టోయినిస్‌ అవుట్‌ అయ్యాడు. 14 ఓవర్లకు 129 పరుగులు చేసింది. శతకం దిశగా సాగుతున్న క్వింటన్‌ డికాక్‌ ను రీస్‌ టాప్లీ అవుట్‌ చేశాడు. డికాక్‌ 56 బంతుల్లో 8 ఫోర్లు, అయిదు భారీ సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. 18 ఓవర్‌లో చివరి బంతికి బదోని అవుట్‌ అయ్యాడు. రీస్‌ టాప్లీ వేసిన ఓవర్‌లో నికోలస్‌ పూరన్‌..మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. నికోలస్‌ పూరన్‌ 21 బంతుల్లో 1 ఫోర్‌, అయిదు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. దీంతో అయిదు వికెట్లతో 181 పరుగులు చేసింది. 


బెంగళూరు టపటప
182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు... 153 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలో బాగానే ఆడినా ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించి మంచిగానే ఆరంభించిన బెంగళూరు ఆ తర్వాత గాడి తప్పింది. విరాట్‌ కోహ్లీ 19 పరుగులతో అవుటైనప్పుడు ప్రారంభమైన ఆర్సీబీ పతనం  తర్వాత వేగంగా కొనసాగింది. రజత్‌ పాటిదార్‌ 29, మాక్స్‌వెల్‌ 0, కామెరూన్‌ గ్రీన్‌ 9, దినేశ్‌ కార్తీక్‌ నాలుగు, అంకుజ్‌ రావత్‌ 11 పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. దీంతో ముంబై విజయానికి 28 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.
Also Read: ODI World Cup Final Mistake: 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఘోర తప్పిదం- కప్ కేన్ మామకి ఇస్తారా ?