PBKS vs SRH IPL 2024 Punjab Kings targer 183:  ఐపీఎల్‌(IPL)లో పంజాబ్‌(PBKS)తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌(SRH) పోరాడే స్కోరు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి మెరిశాడు. మిగతా బ్యాటర్లు పరుగులు చేసేందుకే కష్టపడుతున్న పిచ్‌పై భారీ హిట్టింగ్‌తో అలరించాడు. నితీశ్‌కుమార్‌రెడ్డికి  కాస్త అబ్దుల్‌ సమద్‌ అండగా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ తెలుగోడు నితీశ్‌ బ్యాటింగ్‌తో ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. నితీశ్‌  37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేయడంతో   నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 182  పరుగులు చేసింది.  పరుగులు రావడం కష్టమైన పిచ్‌పై పంజాబ్‌ ఈ స్కోరును ఛేదిస్తుందేమో చూడాలి.


 

నితీశ్‌ కుమార్‌ ఒక్కడే.. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు పర్వాలేదనిపించే ఆరంభం దక్కింది. తొలి వికెట్‌కు ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ 27 పరుగులు జోడించారు.  15 బంతుల్లో నాలుగు ఫోర్లతో 21 పరుగులు చేసిన ట్రానిస్‌ హెడ్‌ను అవుట్ చేసి అర్ష్‌దీప్‌ తొలి షాక్‌ ఇచ్చాడు. అదే స్కోరుపై మార్క్రమ్‌ కూడా అవుటయ్యాడు. రెండు బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ పెవిలియన్‌ చేరాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌...హైదరాబాద్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రాహుల్‌ త్రిపాఠి 11, క్లాసెన్‌ తొమ్మిది పరుగులు చేసి అవుటవ్వడంతో హైదరాబాద్‌ స్కోరు అసలు 130 అయినా దాటుతుందా అనిపించింది. కానీ తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్‌రెడ్డి తన ఆటతో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. నితీశ్‌ కొట్టిన సిక్సులు చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదు. ఐపీఎల్‌లో నితీశ్‌ తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. హర్‌ ప్రీత్‌ బార్‌ వేసిన ఓవర్‌లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదిన నితీశ్‌... 32 బంతుల్లోనే అర్థ శతకం మార్క్‌ అందుకున్నాడు. ఈక్రమంలో కాస్త ధాటిగా ఆడి 12 బంతుల్లో అయిదు ఫోర్లతో 25 పరుగులు చేసిన సమద్‌... అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అదే ఓవర్‌లో 7 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేసిన నితీశ్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. మళ్లీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అర్ష్‌దీప్‌ షాక్‌ ఇచ్చాడు. హైదరాబాద్‌ సారధి ప్యాట్‌ కమిన్స్‌... నాలుగు బంతుల్లో మూడు పరుగులు చేసి అవుటై నిరాశపరిచాడు. కానీ చివర్లో షాబాజ్‌ అహ్మద్‌ ఒక ఫోరు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేయడంతో   నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 182  పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 4, శామ్‌కరణ్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

 

పంజాబ్‌ బ్యాటింగ్‌ బలంగానే...

పంజాబ్‌ బ్యాటింగ్‌ విభాగంలో శిఖర్ ధావన్‌, జానీ బెయిర్‌ స్టోలతో ఓపెనింగ్‌ జోడీ చాలా బలంగా ఉంది. ధావన్‌ నిలకడగా పరుగులు చేస్తుండగా.. బెయిర్‌స్టో మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు యత్నిస్తాడు. మిడిలార్డర్‌లో జితేశ్, లివింగ్‌స్టోన్‌తోపాటు కొత్త స్టార్లుగా మారిన శశాంక్‌ సింగ్‌ - అషుతోష్‌ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడతారు. వీరిని హైదరాబాద్‌ బౌలర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.