IPL 2026 MI VS CKS Latest Updates: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. టీమ్ ఇండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ద్వారా ధోనీ పునరాగమనం చేసే అవకాశం ఉందని సమాచారం. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే పిక్క కండరాల గాయం (calf strain) కారణంగా ధోనీ రెండు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. ధోనీ లేని లోటు సిఎస్కే ప్రారంభ మ్యాచ్‌ల్లో స్పష్టంగా కనిపించింది. అయితే, గత రెండు మ్యాచ్‌ల్లో వరుస విజయాలు సాధించిన చెన్నై టీమ్, ఇప్పుడు ధోనీ రాకతో మరింత పటిష్టంగా మారనుంది. శనివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్‌తో జరగనున్న మ్యాచ్‌ తర్వాత ధోనీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి వాంఖడేలో బరిలోకి దిగనున్నాడు.

Continues below advertisement

ధోనీ ‘గురు మంత్రం’..కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించడంలో ఆఫ్ఘన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి కోల్‌కతా బ్యాటర్ల నడ్డి విరిచాడు. అజింక్య రహానే, రింకూ సింగ్, కామెరాన్ గ్రీన్ వంటి ప్రమాదకరమైన ఆటగాళ్లను అవుట్ చేసి మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పాడు. ఈ అద్భుత ప్రదర్శన వెనుక ధోనీ హస్తం ఉందని సిఎస్కే అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ వెల్లడించాడు. ప్రాక్టీస్ సెషన్ లో ధోనీతో నూర్ అహ్మద్ సుదీర్ఘంగా చర్చించాడు. లెగ్ బ్రేక్స్ ఎలా వేయాలి, గాలిలో బంతి వేగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై ధోనీ కొన్ని విలువైన సూచనలు చేశాడు. ధోనీ చెప్పినట్లుగా బౌలింగ్ లో మార్పులు చేయడంతోనే నూర్‌కు వికెట్లు దక్కాయని శ్రీరామ్ పేర్కొన్నాడు.

అద్భుత బౌలింగ్..ఈ సీజన్‌లో అంతకుముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నూర్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. కానీ కేకేఆర్ మ్యాచ్‌లో పిచ్ సహకారాన్ని వాడుకుంటూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మరో విండీస్ స్పిన్నర్ అకీల్ హొస్సేన్ కూడా నూర్‌కు తన వంతు సహకారం అందించాడు. స్ట్రాటజిక్ టైమౌట్  (strategic timeout) సమయంలో బంతిని ఏ లెంగ్త్‌లో వేయాలి అనే విషయంపై అకీల్ ఇచ్చిన సలహా నూర్‌కు బాగా ఉపయోగపడింది. బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశం ఇవ్వకుండా, డిఫెన్సివ్ గా కాకుండా అగ్రెసివ్ గా బౌలింగ్ చేయడమే నూర్ విజయానికి కారణమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రో వైపు ధోనీ కేవలం ప్లేయర్‌గానే కాకుండా, మెంటార్‌గా యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తున్నాడు. కాలి గాయంతో తను ఆడలేకపోయినా, నెట్స్‌లో గంటల తరబడి గడుపుతూ కుర్రాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. ఏప్రిల్ 23న ముంబైతో మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇదే స్టేడియంలో 2011లో ధోనీ తన సిగ్నేచర్ సిక్సర్‌తో భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. మళ్ళీ అదే వేదికపై ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సిఎస్కే టీమ్ మళ్ళీ తన పాత వైభవాన్ని సంతరించుకోవడంలో ‘త‌లా’ రాక ఖచ్చితంగా కీలకం కానుందని తెలుస్తోంది.

Continues below advertisement