MI vs DC IPL 2024  Mumbai Indians won by 29 runs: విమర్శలకు చెక్‌ పెడుతూ... అభిమానులకు ఆనందాన్ని పంచుతూ.. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో.. అయిదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌(MI) తొలి విజయం నమోదు చేసింది. తొలుత ముంబై బ్యాటర్లు జూలు విదల్చగా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి ఓవర్‌లో ముంబై బ్యాటర్‌ రొమారియో  షెఫర్డ్‌ ఏకంగా 32 పరుగులు రాబట్టి హార్దిక్‌ సేనకు భారీ స్కోరు అందించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ(DC)... నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది. పృథ్వీ షా, స్టబ్స్‌ రాణించినా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు.


బ్యాటింగ్‌ సాగిందిలా...
ముంబై ఓపెనర్లు దూకుడుగా బ్యాటింగ్‌ ఆరంభించారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. రోహిత్‌ శర్మ-ఇషాన్‌ కిషన్‌ దూకుడుకు ముంబై పవర్‌ప్లే ముగిసే సరికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 75 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో అక్షర్‌ పటేల్‌.. ముంబైకి షాక్‌ ఇచ్చాడు. 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 పరుగులు చేసిన రోహిత్‌ శర్మను బౌల్డ్‌ చేశాడు. దీంతో 80 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో బంతికే అవుటై నిరాశ పరిచాడు. ఎన్నో అంచనాల మధ్య వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌... నోకియా బౌలింగ్‌లో ఫ్రేజర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఎదుర్కొన్న సూర్య ఒక్క పరుగు కూడా చేయకుండా అవుటయ్యాడు. దీంతో 81 పరుగుల వద్ద ముంబయి రెండో వికెట్‌ను కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి 42 పరుగులు చేసిన ఇషాన్ ఔటయ్యాడు. వెంటనే మరో వికెట్‌ నేలకూలింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్‌లో తిలక్‌ వర్మ అక్షర్ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 
పరుగుల రాక కష్టంగా ఉండటంతో హార్దిక్, టిమ్‌ డేవిడ్ ఆరంభంలో ఆచితూచి ఆడారు.


అనంతరం టిమ్‌ డేవిడ్‌ దూకుడు పెంచాడు. జే రిచర్డ్‌సన్ వేసిన ఈ ఓవర్‌లో సిక్స్‌ కొట్టాడు. ఈ క్రమంలో పాండ్యా 39 పరుగులు చేసి అవుటయ్యాడు. టిమ్‌ డేవిడ్‌ 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45, షెపర్డ్‌ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. నోకియా వేసిన చివరి ఓవర్‌లో షెఫర్డ్‌ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో నాలుగు సిక్సులు, రెండు ఫోర్లను బాది మొత్తంగా 32 పరుగులు పిండుకున్నాడు.



ఢిల్లీ పోరాడినా...
235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ పోరాడింది. పృథ్వీ షా, అభిషేక్‌ పోరెల్‌.. స్టబ్స్‌ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఫామ్‌లోకి వచ్చిన పృథ్వీ షా 40 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్సర్లతో 66 పరుగులు చేసి లక్ష్య ఛేదనలో మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ డేవిడ్‌ వార్నర్‌... రిషభ్‌ పంత్‌ విఫలం కావడంతో ఢిల్లీకి లక్ష్య చేధన కష్టమైంది. అభిషేక్‌ పోరెల్‌ 31 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేశాడు. ఢిల్లీని గెలిపించేందుకు స్టబ్స్‌ చివరిదాకా పోరాడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ...  నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులకే పరిమితమైంది.