IPL 2025 New Rules | హైదరాబాద్: క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించిన విధానం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఆటగాళ్లతో పాటు బీసీసీఐకి కాసులవర్షం కురిపించే క్యాష్ ప్రీమియర్ లీగ్ గా ఐపీఎల్ మారింది. అయితే ఐపీఎల్ నిర్వాహకులు TATA IPL 2025-27కుగానూ   ప్లేయర్ రెగ్యులేషన్స్ ను ప్రకటించారు. జూలైలో BCCI ప్రధాన కార్యాలయంలో 10 ఫ్రాంచైజీల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసింది. తాజాగా వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ శనివారం నాడు బెంగళూరులో సమావేశమైంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం ఫ్రాంచైజీలు గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను తిరిగి సొంతం చేసుకోవచ్చు. దాంతో సీఎస్కే ధోనీని తీసుకుంటుంది. విరాట్ కోహ్లీ ఆర్సీబీకే కొనసాగనుండగా.. టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మను ఒప్పించి ముంబై ఇండియన్స్ మళ్లీ కెప్టెన్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది..


IPL ప్లేయర్ రెగ్యులేషన్స్ 2025-2027పై తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
1. ఒక IPL ఫ్రాంచైజీ తమ ప్రస్తుత జట్టు నుంచి గరిష్టంగా 6 మంది ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు. ఇది ఆటగాళ్లను ఫ్రాంచైజీ వద్ద అట్టిపెట్టుకోవడం, లేదా రైట్ టు మ్యాచ్ (RTM) ఎంపిక చేసుకునే వీలుంది. 
2. ఆటగాళ్లను తమ వద్దే కొనసాగించడం (Retain), RTMల కోసం ఫ్రాంచైజీలు ఇది గుర్తుంచుకోవాలి. IPL ఫ్రాంచైజీ 6 మంది రీటైన్ చేసుకోవచ్చు లేదా RTM ద్వారా గరిష్టంగా 5 మంది క్యాప్డ్ ప్లేయర్‌లను (భారత, విదేశీ అంతర్జాతీయ ఆటగాళ్లను) తీసుకోవచ్చు. అయితే గరిష్టంగా ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను సైతం ఉండాలి. 
3. IPL 2025 కోసం ఒక్కో ఫ్రాంచైజీల వేలంలో రూ. 120 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. వీటికి అదనంగా ఆటగాళ్లకు ఫర్మార్మెన్స్ పే, మ్యాచ్ ఫీజు లభిస్తాయి. 2024లో మొత్తం జీతం అంటే (వేలం మొత్తం + ఇంక్రిమెంటల్ పెర్ఫార్మెన్స్ పే) కలిపి రూ. 110 కోట్లుగా ఉండేది. ఇప్పడు దాన్ని ఒక్కో ఫ్రాంచైజీకి ఐపీఎల్ 2025కిగానూ రూ. 146 కోట్లు, ఐపీఎల్ 2026కిగానూ 151 కోట్లు, ఐపీఎల్ 2027కిగానూ రూ. 157 కోట్లుగా నిర్ణయించారు. 
4. ఈసారి ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా మ్యాచ్ ఫీజు అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి ఆటగాడు (ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా) ఒక్కో మ్యాచ్‌కు రూ. 7.5 లక్షల మ్యాచ్ ఫీజును అందుకుంటాడు. ఫ్రాంచైజీ ఇచ్చే కాంట్రాక్టుతో పాటు మ్యాచ్ ఫీజు అదనంగా లభిస్తుంది. 
5. ప్రతి ఒక్క విదేశీ ఆటగాడు ఈ వేలంలో పాల్గొనేందుకు తన పేరు రిజిస్టర్ చేసుకోవాలి. విదేశీ క్రికెటర్లు రిజిస్టర్ చేసుకోకపోతే, వచ్చే ఏడాది వేలంలో తన పేరు నమోదు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. 

6. ఐపీఎల్ వేలంలో తన పేరు రిజిస్టర్ చేసుకుని, అనంతరం ఏదైనా ఫ్రాంఛైజీ అతడ్ని కొనుగోలు చేస్తే.. అతడు లీగ్ ప్రారంభానికి ముందే తనకు తానే అందుబాటులో లేకుండా ఉంటే ఈ టోర్నమెంట్ తో పాటు 2 సీజన్లలో ఐపీఎల్ వేలంలో పాల్గొనకుండా నిషేధం విధించనున్నారు.
7. భారత క్రికెటర్ అయి ఉన్నప్పటికీ.. గత 5 ఏళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ (టెస్టులు, వన్డేలు, ట్వంటీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు) ఆడకపోయినా, లేక BCCIతో సెంట్రల్ కాంట్రాక్ట్ లో లేని ఆటగాళ్లను అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ఇది కేవలం భారత క్రికెటర్లకు మాత్రమే వర్తిస్తుంది.
8. గత ఐపీఎల్ సీజన్లో ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఐపీఎల్ 2025 నుంచి ఐపీఎల్ 2027 వరకు కొనసాంచనున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించారు.


Also Read: Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్