CSK vs GT, IPL Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు గుజరాత్ టైటాన్స్ పేరిట నమోదైంది.


ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ తరఫున 21 ఏళ్ల యువ ఎడమచేతి వాటం ఆటగాడు సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాటు వృద్ధిమాన్ సాహా కూడా 54 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ 214 పరుగులతో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డును బద్దలు కొట్టింది. 2016లో జరిగిన ఐపీఎల్ సీజన్ చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.


ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో అత్యధిక సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జట్లు 37 సార్లు టీమ్ స్కోర్లు 200 మార్కును దాటాయి. అదే సమయంలో ఇంతకుముందు 2022 సీజన్‌లో 18 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోర్లు స్కోర్ చేయబడ్డాయి.


సాయి సుదర్శన్ సూపర్ రికార్డు
ఫైనల్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ 96 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. సాయి సుదర్శన్ ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇది కాకుండా షేన్ వాట్సన్ (117 నాటౌట్), వృద్ధిమాన్ సాహా (115 నాటౌట్) తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి భాగస్వామ్యాలు లభించాయి. మొదటి మూడు వికెట్లకు 50కు పైగా భాగస్వామ్యాలను గుజరాత్ బ్యాటర్లు ఏర్పరిచారు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39: 20 బంతుల్లో, ఏడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (54: 39 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి బంతి నుంచే వేగంగా ఆడారు. వీరి ఆటతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్లో గిల్‌ను అవుట్ చేసి జడేజా మొదటి వికెట్ తీసుకున్నాడు.


ఆ తర్వాత వృద్ధిమాన్ సాహాకు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (96: 47 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు)  జత కలిశాడు. వీరు రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించాడు. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వృద్ధిమాన్ సాహా అవుటయ్యాడు. క్రీజులో కుదురుకున్న సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (21: 12 బంతుల్లో, రెండు సిక్సర్లు) అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. వీరు మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. సెంచరీకి నాలుగు పరుగుల ముంగిట మతీష పతిరనా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది.