ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2024 కోసం ప్లేయర్ల వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో దేశ, విదేశీ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రేపు(డిసెంబర్‌ 19న) దుబాయ్‌ వేదికగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఐపీఎల్‌ వేలం ప్రారంభం కానుంది. అయితే ఈసారి వేలాన్ని మల్లిక సాగర్‌ అడ్వానీ అనే మహిళ నిర్వహించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వేలం నిర్వహించనున్న తొలి మహిళా ఆక్షనిర్‌గా మల్లిక నిలవనుంది. ఈ నేపథ్యంలో ఎవరీ మల్లికా సాగర్‌ అని అందరూ ఒకటే వెతుకుతున్నారు. సోషల్‌ మీడియాలో కూడా మల్లికా ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఈ మల్లికా సాగర్‌ ఎవరంటే...


 48 ఏళ్ల మల్లికా సాగర్‌ ముం‍బై చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. ఆమె మోడ్రన్‌ అండ్‌ కాన్‌టెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. వేలం నిర్వహించడంలో మల్లికకు పూర్వ అనుభవం ఉంది. ఆమె 20ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 2001లో క్రిస్టీస్‌ ఆక్షన్‌ హౌస్‌లో వేలం నిర్వాహకురాలిగా తన కెరీర్‌ మొదలుపెట్టారు. క్రిస్టీస్‌లో వేలం నిర్వహించిన భారత సంతతికి తొలి మహిళ ఆక్షనీర్‌గా మల్లికా నిలిచింది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో తన వాక్‌ చాతుర్యంతో మల్లికా అందరిని అకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లికానే నిర్వహించింది.  డిసెంబర్‌ 9న ముంబై వేదికగా జరిగిన వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ వేలంలో కూడా మల్లికా ఆక్షనీర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు ఐపీఎల్‌ వేలాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.


ఐపీఎల్ 2024 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఐపీఎల్-17 షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటికే ఆటగాళ్ల రిలీజ్‌, రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయింది. డిసెంబర్ 19న ఐపీఎల్‌ మినీ వేలం జరగనుంది. పది ప్రాంఛైజీలు కొంతమంది ఆటగాళ్లను వదులుకోగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు 1166 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా... వేలంలో మొత్తం 333 మంది అమ్మకానికి ఉంటారు. 77 ఖాళీలు ఉండగా.... ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు 333 మంది పోటీ పడుతున్నారు.


ఐపీఎల్‌ వేలంలో మొత్తం 1166 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా..ఐపీఎల్‌ పాలకవర్గం మొత్తం ఈ జాబితాను పది ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు అందించింది. ఆటగాళ్లపై ఫ్రాంఛైజీల ఆసక్తి ఆధారంగా జాబితాను 333కు కుదించింది. ఇందులో 214 మంది భారతీయులు, 119 మంది విదేశీయులు, అసోసియేట్‌ దేశాల నుంచి ఇద్దరు ఉన్నారు. హర్షల్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌ కనీస ధర రూ.2 కోట్లు ఉన్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రెండేళ్ల కింద జరిగిన వేలంలో హర్షల్‌ రూ.10.75 కోట్లకు అమ్ముడుపోయాడు. వేలంలో ఖర్చు పెట్టడానికి ఫ్రాంఛైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి. మొత్తం 77 మంది నుంచి గరిష్టంగా 30 మంది విదేశీ క్రికెటర్లను జట్లు కొనుక్కోవచ్చు. ఈసారి వేలంలో స్టార్‌ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా గెలవడంలో కీలకపాత్ర పోషించిన ట్రావిస్‌ హెడ్‌, కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌కు మంచి ధర పలికే అవకాశం ఉంది. ఈ ఆసీస్‌ త్రయం 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. న్యూజిలాండ్‌ స్టార్‌ రచిన్‌ రవీంద్ర తన కనీస ధరను రూ.50 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.