జైపూర్: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. సన్రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ సెక్యూరిటీకి సంబంధించిన ఒక వింతైన ఆఫ్ ఫీల్డ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వీడియోలో టీం హోటల్లో స్టార్ క్రికెటర్ను చూసిన ఒక మహిళా అభిమాని బలవంతంగా అభిషేక్ శర్మ చేయి పట్టుకుని లాగింది. ఆటగాడిని చూసిన ఉత్సాహంలో అభిమాని అలా చేసింది.
చుట్టూ భద్రతా అధికారులు ఉన్నప్పటికీ ఈ ఘటన అభిషేక్ను తీవ్ర అసహనానికి గురిచేసింది. అభిషేక్ కొంచెం అన్కంఫర్టబుల్గా కనిపించాడు. ఈ పరిణామం అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు ఇది భద్రతా లోపమని చెబుతున్నారు. మరోవైపు ఇదే పని ఓ మగవాడు చేసి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అభిమానంతో చేసిన చేష్టలా అనిపించినప్పటికీ, క్రికెటర్ల వ్యక్తిగత స్వేచ్ఛకు కలిగించకూడదని నెటిజన్లు అంటున్నారు. అభిమానం హద్దులు దాటితే చిక్కుల్లో పడతారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫ్యాన్ గర్ల్ అభిషేక్ చేతికి పట్టుకుని లాగిన వెంటనే పరిస్థితి మరింత ముదరక ముందే హోటల్లోని భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని అమ్మాయి చేతి నుంచి విడిపించి ఆటగాడిని అక్కడి నుండి పంపేశారు.
మరోవైపు, జైపూర్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఐపీఎల్ 2026లో తన మూడవ హాఫ్ సెంచరీ చేసి ఎస్ఆర్హెచ్ (SRH), రాజస్తాన్ రాయల్స్ (RR) పై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ 196 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో, 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ను అధిగమించి ఎస్ఆర్హెచ్ తరపున అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు.
రాయల్స్పై సన్రైజ్ విజయం..
జైపూర్లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ (103) సాయంతో 228 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్ కిషన్ (74) కీలక ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. ఈ సీజన్లో సన్రైజర్స్కు ఇది తొలి ఛేజింగ్ విజయం కాగా, మొత్తంగా ఐదో గెలుపుతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇది టోర్నీ చరిత్రలో నాలుగో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్గా నమోదైంది.
