IPL 2024 Rajasthan Royals won by 6 wkts: ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ శతకంతో చెలరేగినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. కింగ్‌ కోహ్లీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లోనే తొలి శతకంతో చెలరేగిన వేళ... రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ మరో  5 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. జోస్‌  బట్లర్‌, సంజు శాంసన్‌ విధ్వంసంతో రాజస్థాన్‌... బెంగళూరుపై విజయం సాధించింది.

 

కోహ్లీ ఒక్కడే...

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. చివరి బంతికి డుప్లెసిస్ బౌండరీ బాదాడు. ఆరంభం నుంచే విరాట్ కోహ్లీ  దూకుడుగా ఆడాడు. నంద్రి బర్గర్ వేసిన రెండో ఓవర్‌లో 13 పరుగులు రాగా.. కోహ్లీ రెండు బౌండరీలు బాదాడు. నంద్రి బర్గర్ వేసిన నాలుగో ఓవర్‌లో రెండో బంతిని డీప్‌ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌ మీదుగా కోహ్లీ కొట్టిన సిక్సర్‌ చూసి తీరాల్సిందే. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు వికెట్‌ నష్టపోకుండా 88 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. సిక్స్‌తో కోహ్లీ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. విరాట్ కోహ్లీ 39 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.11 ఓవర్లకు స్కోరు 98/0. 12ఓవర్‌లో బెంగళూరు స్కోరు వంద పరుగులు దాటింది. 13 ఓవర్లకు స్కోరు 115/0. చాహల్ వేసిన 14 ఓవర్‌లో చివరి బంతికి 44 పరుగులు చేసిన డుప్లెసిస్‌ అవుటయ్యాడు. అనంరం మ్యాక్స్‌వెల్  ఒక్క పరుగే చేసి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. నంద్రి బర్గర్ వేసిన 15 ఓవర్‌లో ఐదో బంతికి మ్యాక్సీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 16వ ఓవర్‌లో బెంగళూరు స్కోరు 150 దాటింది. 17 ఓవర్లకు స్కోరు 154/2. చాహల్ వేసిన 17.2 ఓవర్‌కు సౌరభ్‌ చౌహన్‌ 9 పరుగులు చేసి యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరం విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో కోహ్లీ మూడంకెల స్కోరు అందుకున్నాడు. విరాట్‌ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  విరాట్‌ ఒంటరి పోరుతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3  వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.

 

శాంసన్‌, బట్లర్‌ జోరు

184 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే యశస్వీ జైస్వాల్‌ డకౌట్‌ అయ్యాడు. ఈ ఆనందం బెంగళూరుకు ఎంతోసేపు నిలవలేదు. జోస్‌ బట్లర్‌, సంజు శాంసన్‌... బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శాంసన్‌ 42 బంతుల్లో 69 పరుగులు చేసి అవుటైనా బట్లర్‌ చివరి దాకా క్రీజులో నిలబడి రాజస్థాన్‌ను విజయతీరాలకు చేర్చాడు. బట్లర్‌ 58 బంతుల్లో  4సిక్సులు 9 ఫోర్లతో 100 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్‌ మరో 55 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.