Rohit Sharma records in MI vs CSK Match :  ముంబై ఇండియన్స్‌(MI)పై  చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) పంజా విసిరింది. రోహిత్‌ శర్మ(Rohit Sharma) విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. రోహిత్‌ శర్మ అజేయ శతకంతో మెరిసినా మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలబడ్డ రోహిత్‌... ముంబైను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్‌ శర్మ శతకంతో 186 పరుగులు చేయగలిగింది.  ముంబై బ్యాటర్లు విఫలమైనా... రోహిత్ శర్మ మాత్రం ఒంటరి పోరు చేశాడు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో అజేయ శతకంతో హిట్‌మ్యాన్‌ చివరి వరకూ పోరాడాడు. రోహిత్‌కు అవతల బ్యాటర్ల నుంచి మద్దతు కరువైంది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. రోహిత్‌ ఒంటరి పోరాటం తర్వాత మరోసారి సోషల్‌ మీడియా హిట్‌మ్యాన్‌ పేరుతో హోరెత్తుతోంది. అద్భుత శతకంతో హిట్‌మ్యాన్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

 

ఇదే తొలిసారి..

రోహిత్ శర్మ ఈ మ్యాచులో శతకంతో అజేయంగా నిలిచాడు. ఇలా హిట్‌మ్యాన్‌ నాటౌట్‌గా నిలిచి అతడు ఆడుతున్న జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలం కావడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ అజేయంగా నిలిచిన 18 మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘన విజయం సాధించింది. ఈ ఐపీఎల్‌లో మొదటి సెంచరీతో రోహిత్‌ మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. ఐపీఎల్‌లో ముంబై తరఫున ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కూడా రోహిత్‌ నిలిచాడు. 12 ఏళ్ల తర్వాత  ఐపీఎల్‌లో రోహిత్ సెంచరీ సాధించాడు. టీ20 క్రికెట్‌లో రోహిత్‌కి ఇది ఎనిమిదో సెంచరీ. వాంఖడే స్టేడియంలో  పొట్టి క్రికెట్‌లో రోహిత్‌కి ఇదే తొలి సెంచరీ. టీ20 సెంచరీల విషయంలో తొమ్మిదో శతకాలతో విరాట్‌ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో రోహిత్ నిలిచాడు. రోహిత్ టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్లు కొట్టిన రికార్డును కూడా సృష్టించాడు. రోహిత్ 11వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన అద్భుతమైన సిక్స్ ద్వారా T20 క్రికెట్లో తన 500 సిక్సర్ల రికార్డును పూర్తి చేశాడు. 432 మ్యాచ్‌ల్లో 419 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ప్రపంచంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు.

 

రోహిత్‌ కోసం జీవితం ఇచ్చేస్తా..

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి వస్తే అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే పణంగా పెడుతానని ప్రీతిజింటా వ్యాఖ్యానించింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ జట్టు వరుస పరాజయాలతో సతమతం అవుతున్న వేళ ప్రీతి జింటా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పంజాబ్‌ నిలకడగా ఆడుతూ.. ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన కెప్టెన్ అవసరం ఉందని ప్రీతీ జింటా అభిప్రాయపడింది. వచ్చే ఏడాది జరిగే మెగా వేలంలోకి రోహిత్ శర్మ వస్తే.. అతన్ని తీసుకునేందుకు తన జీవితాన్నే బెట్ కాస్తానని తెలిపింది. రోహిత్ శర్మ మెగా వేలంలోకి వస్తే అతన్ని కొనుగోలు చేసేందుకు తన సర్వస్వాన్ని బెట్ కాస్తానని ప్రీతిజింటా తెలిపింది. ఛాంపియన్ మైండ్ సెట్ కలిగిన కెప్టెన్‌ అవసరం తమకుందని జింటా తెలిపింది.