RCB vs PBKS Head To Head Stats  Results and Record: విరాట్‌ కోహ్లీ(Virat Kohli), డుప్లెసిస్‌,  మ్యాక్స్‌వెల్‌ వంటి విధ్వంసకర బ్యాటర్లు... సిరాజ్‌, ఫెర్గూసన్‌, వంటి బౌలర్లతో పటిష్టంగా కనిపిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కు తొలి మ్యాచ్‌లో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. కీలక ఆటగాళ్లున్నా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు, బౌలర్లు తేలిపోవడంతో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. అయితే ఇప్పుడు రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై సమష్టిగా రాణించి ఈ ఐపీఎల్‌లో తొలి విజయం సాధించాలని బెంగళూరు పట్టుదలగా ఉంది. అయితే పంజాబ్-బెంగళూరు రికార్డులు ఎలా ఉన్నాయో   ఓసారి చూసొద్దాం పదండీ...

రెండు జట్ల పోటాపోటీ
ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటివరకూ 31 సార్లు తలపడ్డాయి.ఈ మ్యాచుల్లో బెంగళూరుపై పంజాబ్‌కే కాస్త పైచేయి కనిపిస్తోంది. మొత్తం 31 మ్యాచుల్లో పంజాబ్‌ 17 సార్లు గెలుపొందగా...బెంగళూరు 14సార్లు విజయం సాధించింది.  
 
పిచ్‌ రిపోర్ట్‌
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు అవుతాయి. తరచుగా అధిక స్కోరింగ్ మ్యాచ్‌లకు ఈ స్టేడియం వేదికగా మారుతుంది. చిన్న బౌండరీలు, ఫాస్ట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు చేస్తుంది. అయితే, ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు పోటీలో ఉండాలంటే కచ్చితంగా 200 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఎంత భారీ స్కోరు చేసినా ఈ పిచ్‌పై అది సురక్షితం కాదు. 
 
కోహ్లీపైనే ఆశలు
విరాట్ కోహ్లీపైనే బెంగళూరు భారీ ఆశలు పెట్టుకుంది. ఒక్కసారి కోహ్లీ ఫామ్‌లోకి వస్తే ప్రత్యర్థి జట్లకు తిప్పలు తప్పవు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCBకి మొదటి విజయాన్ని అందించాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. సిరాజ్ కూడా బౌలింగ్‌లో రాణిస్తే ఇక బెంగళూరుకు తిరుగుండదు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  RCB ఆరు వికెట్లకు 173 పరుగులు చేసినా ఇందులోనూ లోపాలు బహిర్గతం అయ్యాయి. ఓ దశలో RCB ఐదు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో దినేష్ కార్తీక్, అనుజ్ రావత్‌ ఆర్సీబీని ఆదుకున్నారు. విరాట్ కోహ్లి, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్ జోరు అందుకుంటే భారీ స్కోరు ఖాయమే. రజత్ పాటిదార్ నుంచి బెంగళూరు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ స్కోరు ఆశిస్తోంది. మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్,  యష్ దయాల్ గాడిన పడితే బెంగళూరు కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ 9.5, జోసెఫ్ 10.3, దయాల్ 9.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. ఈమ్యాచ్‌లో వీరు గాడిన పడాల్సి ఉంది.
 
తొలి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.  ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ ఇరు జట్లు పోరాడినా చివరికి గెలుపు పంజాబ్‌నే వరించింది. శామ్‌ కరణ్‌ 63 పరుగులతో పంజాబ్‌కు విజయాన్ని అందించాడు. లివింగ్‌ స్టోన్‌ కూడా చివరి వరకూ క్రీజులో నిలిచి పంజాబ్‌ను గెలిపించాడు. వీరందరూ మరోసారి రాణిస్తే బెంగళూరుపై పంజాబ్‌ విజయం సాధించే అవకాశం ఉంది.