IPL 2024 Opening Ceremony at MA Chidambaram Stadium:  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2024) ఆరంభానికి సమయం ఆసన్నమైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే తొలి దశ మ్యాచ్‌ల కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ సీజన్​ను కూడా ఘనంగా ప్రారంభించాలని ఐపీఎల్ బోర్డు భావిస్తోంది. అందుకోసం సీజన్ ప్రారంభం రోజున చెన్నై చిదంబరం స్టేడియంలో గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ (Opening Ceremony) నిర్వహించనున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అంటే మార్చి 22న సాయంత్రం 6.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మ్యూజిక్ మాయిస్ట్రో ఏఆర్ రెహమాన్, సింగర్ సోనూ నిగమ్‌ల ప్రదర్శన ఉంటుంది.

  


 చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక అందులో సోనూ నిగమ్, రెహమాన్, అక్షయ్ కుమార్, టైగర్ పెర్ఫార్మెన్స్ అంటే సీజన్​కు ఈవెంట్​కు ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్‌ కోసం ఐపీఎల్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా  అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో విండో ఓపెన్‌ కాగానే క్షణాల్లో అయిపోయాయి. ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయ విండో ఓపెన్‌ చేయగానే క్షణాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే విక్రయించారు. అయినా విక్రయం ప్రారంభమైన వెంటనే టికెట్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రూ.7500, రూ.4500, రూ.4000, రూ.1700 టికెట్లన్నీ క్షణాల్లోనే అయిపోయాయి. దీంతో చాలా మంది ఫ్యాన్స్ టికెట్లు దొరకడం లేదని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.


ధోనీతోనే అసలు యుద్ధం


కూల్‌ కెప్టెన్‌.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్‌ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్‌ ప్రపంచానికి చాటి చెప్పాడు. IPLలో ఎంఎస్ ధోనీ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గానూ ధోనీ ఇప్పటికే రికార్డు సృష్టించాడు.


కోహ్లీకి ఇక్కడ చెత్త రికార్డే 


చెపాక్‌ స్టేడియంలో కోహ్లీ టీంకు చాలా చెత్త రికార్డు ఉంది. ఇక్కడ ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్‌ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈసారి చెన్నైకు బెంగళూరు చెక్‌ పెడుతుందని అభిమానులు గంపెడాశలతో ఉన్నారు. మహిళల జట్టు ఇప్పటికే WPL టైటిల్‌ గెలచుకుందని... ఇక ఆర్సీబీ కూడా తమ ఆశలను నిలబెట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.