GT Won by 6 runs : ఐపీఎల్‌(IPL)లో ముంబై ఇండియన్స్‌(MI)కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. టైటిల్‌ వేటను ఘనంగా ఆరంభించాలనుకున్న ముంబై ఆశలపై  గుజరాత్‌ టైటాన్స్‌(GT) నీళ్లు చల్లింది. తొలి మ్యాచ్‌లో ముంబైపై గుజారాయ్ అద్భుత విజయం సాధించి ఐపీఎల్‌ 17వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది. ఈమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకోగా... బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్యానికి 6 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. రోహిత్‌ శర్మ, బ్రెవీస్‌ రాణించినా ముంబైకు ఓటమి తప్పలేదు. మ్యాచ్ చివర్లో గుజరాత్ బౌలర్లు అద్భుత బౌలింగ్ తో...ముంబై బాటర్లను కట్టడి చేశారు...

 

రాణించిన ముంబై బౌలర్లు...

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. హార్దిక్ పాండ్య వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్‌ గిల్, వృద్ధీమాన్ సాహా మంచి ఆరంభమే ఇచ్చారు. 3 ఓవర్లకు 27 పరుగులు చేశారు. ఈ సమయంలో గుజరాత్‌కు జస్‌ప్రీత్‌ బుమ్రా షాక్‌ ఇచ్చాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి సాహా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 19 పరుగులు చేసి సాహా అవుటయ్యాడు. శుభ్‌మన్‌ గిల్‌ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 47/1. ఈ సమయంలో గుజరాత్ కీలకమైన వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో లాంగాన్‌లో రోహిత్‌ శర్మకు చిక్కాడు. 66 పరుగుల వద్ద గిల్‌ అవుటయ్యాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న గెరాల్డ్ కొయెట్జీ మొదటి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ 12 ఓవర్‌లో చివరి బంతికి 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కొయెట్జీ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ (12), సాయి సుదర్శన్‌ (45) పరుగులు చేసి అవుటయ్యారు.  బుమ్రా బౌలింగ్‌లో సాయి సుదర్శన్‌ అవుటయ్యాడు. తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో గుజరాత్  నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.

 

లక్ష్య ఛేదన ఇలా...

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు తొలి ఓవర్‌లోనే దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ అయ్యాడు. ఒమ్రాజాయ్‌ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ వెనుదిరిగాడు. రోహిత్‌ శర్మకు జత కలిసిన నమన్‌ ధీర్ ముంబై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 30 పరుగులు జోడించారు. 30 పరుగుల వద్ద నమన్‌ వెనుదిరిగినా రోహిత్‌ సమయోచిత ఇన్నింగ్స్‌తో తాను ఎంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. బ్రెవిస్‌తో జత కలిసి ముంబైను లక్ష్యం దిశగా నడిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు విలువైన 77 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సుతో 43 పరుగులు చేసిన రోహిత్‌ను సాయి కిశోర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే 38 బంతుల్లో 2 ఫోర్లు, మూడు సిక్సులతో 46 పరుగులు చేసిన బ్రెవిస్‌ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన ముంబై తొలి మ్యాచులో పరాజయం పాలైంది