మిగతా జట్ల వికెట్లు పడుతూ ఉంటే.... ఆ ఫ్యాన్స్ అయ్యో అనుకుంటారు. కానీ తమ అభిమాన జట్టు వికెట్లు పడుతుంటే.... ఆనందించేది... చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రమే. దానికి కారణం. ఆ జెర్సీ నంబర్ 7 గ్రౌండ్ లోకి వస్తుందేమో అని ఆశ. 2 బాల్స్ ఆడినా చాలు మురిసిపోదామని ఎదురుచూస్తుంటారు.


ఈ సీజన్ సీఎస్కే మ్యాచ్ ఎక్కడ ఆడుతుందో అన్న విషయంతో సంబంధం లేకుండా.... ఏ స్టేడియమైనా సరే పసుపు మయమైపోతోంది. బహుశా కెప్టెన్ కూల్ కు ఇదే ఆఖరి సీజన్ అవొచ్చన్న అంచనాలతో ఫ్యాన్స్ వేలల్లో తరలివస్తున్నారు. నిన్న కేకేఆర్ తో ఈడెన్ గార్డెన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అంతే. సీఎస్కే బ్యాటర్లందరూ అదరగొట్టేస్తున్నారు. ఇక ధోనీ రాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్ లో జడేజా ఔట్ అవగానే 2 బాల్స్ కోసం క్రీజులోకి వచ్చాడు. షాట్స్ కోసం ట్రై చేసినా కనెక్ట్ అవలేదు. అది పక్కన పెట్టండి.


ధోనీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది... ఫ్యాన్స్  కేరింతలతో. ఇక్కడ స్పెషాల్టీ ఏంటంటే.... స్టేడియంలో ధోనీ ధోనీ అన్న అరుపులకు డగౌట్ లో ఉన్న కేకేఆర్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ కూడా గొంతు కలిపాడు. కానీ ఒక్కసారిగా కెమెరా అతనివైపు తిరిగింది. ఓహ్ నేను అపోజిషన్ ప్లేయర్ కదా... కాస్త కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగా నవ్వేశాడు. ఎంతైనా ధోనీ ఈజ్ ఏ లెజెండ్ కదా.... జట్లతో సంబంధం లేకుండా చాలా మందికి ఆరాధ్యభావం ఉంటుంది.


 కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 49 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 235 పరుగులు చేసింది. అనంతరం కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది. 


కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్ (61: 26 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రింకూ సింగ్ (53 నాటౌట్: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. కానీ వారికి మిగతా టీమ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే...  విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అజింక్య రహానే (71 నాటౌట్: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహానే 245 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. శివం దూబే (50: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు), డెవాన్ కాన్వే (56: 40 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీలు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 18 సిక్సర్లు కొట్టడం విశేషం.


ఆరంభంలోనే ఎదురుదెబ్బలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్లకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు చేరే సరికే ఓపెనర్లు సునీల్ నరైన్, ఎన్ జగదీషన్ పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. కానీ వేగంగా ఆడలేకపోయారు. జేసన్ రాయ్ ఎంట్రీతో కోల్‌కతా ఇన్నింగ్స్ వేగం పుంజుకుంది. రాయ్ మొదటి బంతి నుంచి చిచ్చరపిడుగులా చెలరేగాడు. అయితే రాయ్ వచ్చిన కాసేపటికే నితీష్ రాణా అవుటయ్యాడు. కానీ జేసన్ రాయ్, రింకూ సింగ్ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. కోల్‌కతా అభిమానులకు మ్యాచ్‌లో ఏ దశలోనైనా గెలుపుపై ఆశలు ఉన్నాయా అంటే అది వీరు క్రీజులో ఉన్నప్పుడే. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జేసన్ రాయ్ అవుటయ్యాక కోల్‌కతా ఓటమి ఖరారైంది. తర్వాత వచ్చిన వారిలో ఎవరూ క్రీజులో నిలబడలేదు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులకే పరిమితం అయింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, మహీష్ థీక్షణలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆకాష్ సింగ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, పతిరాణాలు తలో వికెట్ పడగొట్టారు.