Mark Wood On MS Dhoni: ఐపీఎల్ 2023 ఆరో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం చెపాక్‌లో ఏప్రిల్ 3వ తేదీన జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివమ్ దూబే చెన్నైకి ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడారు.


కానీ మహేంద్ర సింగ్ ధోని మాత్రం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ, మార్క్ వుడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇప్పుడు లక్నోకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ మహేంద్ర సింగ్ ధోని గురించి తన స్పందనను తెలిపాడు.


చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోని క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో మార్క్ వుడ్ బౌలింగ్ చేస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్ వుడ్, 'ధోని బ్యాటింగ్‌కి వచ్చి రెండు సిక్సర్లు కొట్టినప్పుడు, మైదానంలో అరుపులు చాలా బిగ్గరగా వినిపించాయి. ఇప్పటివరకు నేను విన్న అరుపుల్లో అవే అత్యంత బిగ్గర అయినవి.' అన్నాడు. చెన్నై ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజాను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చిన వెంటనే మార్క్ వుడ్ వేసిన బంతిని థర్డ్ మ్యాన్ మీదుగా తొలి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత మిడ్ వికెట్ మీదుగా రెండో సిక్సర్ కొట్టాడు. ఈ రెండు సిక్సర్ల తర్వాత మైదానంలో ప్రేక్షకుల ఆనందానికి తావు లేకుండా పోయింది. 


మహేంద్ర సింగ్ ధోని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అతను ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. తన కెప్టెన్సీలో ఇప్పటివరకు నాలుగుసార్లు చెన్నైని ఛాంపియన్‌గా నిలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన రెండో కెప్టెన్.


అతను దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందాడు. ఇక్కడ ధోనిని ‘తల’ అని పిలుస్తారు. ఐపీఎల్ 2023లో ధోని మంచి టచ్‌లో కనిపించాడు. 16వ సీజన్‌లో, అతను రెండుసార్లు బ్యాటింగ్‌కి వచ్చాడు. రెండు సార్లు సిక్సర్లు కొట్టాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఇబ్బందికరంగా ఉంది. అయితే ఈసారి టైటిల్ గెలవాలని ధోనీ భావిస్తున్నాడు.


మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లను కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ తీవ్రంగా మందలించాడు. ఇకపై నోబాల్స్‌, వైడ్లు, ఎక్స్‌ట్రాలు ఇవ్వొద్దని సీరియస్‌గా హెచ్చరించాడు. మున్మందు ఇలాగే బౌలింగ్‌ చేస్తే మరో కెప్టెన్‌ను చూసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై విజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.


ఒకప్పటితో పోలిస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలింగ్‌ పేలవంగా మారింది. యువ పేసర్లు ఒత్తిడికి లోనవుతున్నారు. బ్యాటర్లు సిక్సర్లు కొడతారేమోనన్న భయంతో వైడ్లు, నో బాల్స్‌ వేస్తున్నారు. లక్నో మ్యాచులో దీపక్‌ చాహర్‌, తుషార్ దేశ్‌పాండే వరుసగా వైడ్లు, నోబాల్స్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈ పోరులో సీఎస్కే మొత్తం 18 ఎక్స్‌ట్రాలు ఇచ్చింది. 2 లైగ్‌బైస్‌, 13 వైడ్లు, 3 నోబాల్స్‌ వేసింది. గుజరాత్ టైటాన్స్‌ మ్యాచులోనూ 6 లెగ్‌బైస్‌, 4 వైడ్లు, 2 నోబాల్స్‌ వేయడం గమనార్హం.