Mohit Sharma: అన్‌సోల్డ్ నుంచి పర్పుల్ క్యాప్ రేసు దాకా - ఐపీఎల్‌‌లో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చిన మోహిత్ శర్మ!

ఐపీఎల్ 2023లో మోహిత్ శర్మ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేసులో కూడా ఉన్నాడు.

Continues below advertisement

GT vs MI, Indian Premier League 2023: గుజరాత్ టైటాన్స్ (GT) ఈ సీజన్‌లోని రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను 62 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండో సీజన్‌లోనూ ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. మరోవైపు మోహిత్ శర్మ తను వేసిన 2.2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

Continues below advertisement

34 ఏళ్ల మోహిత్ శర్మ ఐపీఎల్‌కు తిరిగి రావడం నిజంగా మామూలు విషయం కాదు. 2022 సీజన్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియలో ఏ జట్టు కూడా మోహిత్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో గత సీజన్లో అతను గుజరాత్ టైటాన్స్ జట్టుకు నెట్ బౌలర్ పాత్రను పోషించాడు.

ఇప్పుడు ఈ సీజన్‌లో గుజరాత్ అతనిని తమ ప్రధాన జట్టులో భాగంగా చేయాలని నిర్ణయించుకుంది. ఇది సరైన నిర్ణయం అని మోహిత్ ప్రదర్శనతోనే నిరూపించుకున్నాడు. మోహిత్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 13.54 సగటుతో మొత్తం 24 వికెట్లు తీశాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ జాబితాలో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ తర్వాత మోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.

డేంజరస్ సూర్యకుమార్ క్లీన్ బౌల్డ్
సూర్యకుమార్ యాదవ్ ప్రమాదకరంగా స్కోరు చేస్తున్న సమయంలో మోహిత్ శర్మ బౌల్డ్ చేసి గుజరాత్‌కు భారీ బ్రేక్‌ను అందించాడు. దీని గురించి మోహిత్ మాట్లాడుతూ... సూర్యకుమార్‌పై బౌలింగ్‌లో ఎక్కువ ప్రయోగాలు చేయకూడదని తాను ఇప్పటికే నిర్ణయించుకున్నానని చెప్పాడు.

‘ఎందుకంటే ఇలా చేయకపోతే సూర్యకు పరుగులు చేయడం చాలా ఈజీ అవుతుంది. మీరు మీ లైన్ అండ్ లెంత్‌పై మాత్రమే శ్రద్ధ వహించాలి. అతను షాట్ కొట్టగలిగితే మీరు బాధపడకండి. ఎందుకంటే అతను ఔట్ అయిన వెంటనే మీరు మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇస్తారు.’ అన్నాడు.

మరోవైపు ఐపీఎల్ 16వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 129 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయానికి ఈ ఇన్నింగ్స్ సాయపడింది. దీని ఆధారంగా గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్‌లో తన మూడో సెంచరీ ఇన్నింగ్స్ ఆధారంగా కొన్ని పాత రికార్డులను కూడా బద్దలు కొట్టాడు శుభ్‌మన్ గిల్.

ఈ సీజన్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు బ్యాట్‌తో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. గిల్ ఇప్పటివరకు 16 ఇన్నింగ్స్‌ల్లో 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు నాలుగు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్లో 123 పరుగులు చేస్తే 2016లో విరాట్ కోహ్లీ చేసిన 973 పరుగుల రికార్డును బద్దలు కొడతాడు.

129 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆధారంగా, ఇప్పుడు ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మాన్ గిల్ నిలిచాడు. గతంలో ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులతో మొదటి స్థానంలో, షేన్ వాట్సన్ 117 పరుగులతో రెండో స్థానంలో ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన లోకేష్ రాహుల్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, గిల్ 129 పరుగుల ఇన్నింగ్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు.

Continues below advertisement