ఐపీఎల్‌లో శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లియాం లివింగ్‌స్టోన్ (70: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... జానీ బెయిర్‌స్టో (66: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (21: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జానీ బెయిర్‌స్టో బెంగళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. మొదటి వికెట్‌కు ఐదు ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అనంతరం గ్లెన్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ అవుటయ్యాడు. అనంతరం మహ్మద్ సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో 23 పరుగులు రావడంతో పంజాబ్ పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో ఒక జట్టు చేసిన ఇదే అత్యధిక స్కోరు ఇదే.


భనుక రాజపక్స (1: 3 బంతుల్లో) విఫలం కాగా... ఆ తర్వాత బెయిర్‌స్టో కూడా అవుట్ కావడంతో పంజాబ్ 101 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లియాం లివింగ్‌స్టోన్ ఎప్పటిలాగే చెలరేగి ఆడాడు. తనకు మయాంక్ అగర్వాల్ (19: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మయాంక్ అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.


ఆ తర్వాత మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోయినా... లివింగ్‌స్టోన్ ఒక ఎండ్‌లో చెలరేగి ఆడాడు. ఒకదశలో పంజాబ్ 220 పరుగుల మార్కును అందుకునేలా కనిపించింది. అయితే చివరి ఓవర్లో హర్షల్ పటేల్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితం అయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్‌కు నాలుగు, వనిందు హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.