ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (77: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), దీపక్ హుడా (52: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించారు. ఢిల్లీ విజయానికి 120 బంతుల్లో 196 పరుగులు కావాలి.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ (23: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన క్వింటన్ డికాక్.. లలిత్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో లక్నో మొదటి వికెట్ కోల్పోయింది.


కేఎల్ రాహుల్‌తో కలిసి దీపక్ హుడా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కేఎల్ రాహుల్ మొదట కొంచెం నిదానంగా ఆడినప్పటికీ మెల్లగా వేగం పెంచాడు. ఇక దీపక్ హుడా మొదట్నుంచి వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కేఎల్ రాహుల్, 14వ ఓవర్లో దీపక్ హుడా అర్థ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ అవ్వగానే దీపక్ హుడా అవుట్ కావడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.


దీంతో మార్కస్ స్టోయినిస్ (17 నాటౌట్: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) క్రీజులోకి వచ్చాడు. తను వేగంగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. రన్‌రేట్ కూడా పడిపోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ కొట్టిన కేఎల్ రాహుల్, నాలుగో బంతికి లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్‌తో అవుటయ్యాడు. చివరి ఓవర్లో ముస్తాఫిజుర్ టైట్ బౌలింగ్ వేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితం అయింది. ఈ మూడు వికెట్లనూ శార్దూల్ ఠాకూరే తీశాడు. లక్నో సూపర్ జెయింట్స్ చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు సాధించింది.