IPL 2022, CSK: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premier leauge) సరికొత్త సీజన్‌కు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings) సరికొత్తగా రెడీ అవుతోంది! ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) మరోసారి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. మిగతా ఫ్రాంచైజీలకు ఊహించని షాకిచ్చాడు. ఐపీఎల్‌-22 (IPL 2022) సీజన్‌కు ప్రాక్టీస్‌ చేసేందుకు తమ డెన్‌ను చెపాక్‌ నుంచి మరోచోటకు సీఎస్‌కే తరలిస్తోంది.


ఎంఎస్‌ ధోనీ కొండంత బలం


ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుంటుంది. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీయే వారికి కొండంత బలం. ప్రతిసారీ ఎంతో జాగ్రత్తగా, బాగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచులను గెలిపించేస్తుంటాడు. ఐపీఎల్‌-2022 సీజన్ కోసమూ మహీ అలాగే చేస్తున్నాడు. సీజన్‌ ఇంకా ఆరంభమే కాలేదు అప్పుడే ప్రత్యర్థులపై మానసికంగా విజయం సాధించేశాడు!


CSK డెన్‌ చెపాక్‌


ప్రతి సీజన్‌కు నెల రోజుల ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తుంది. తమ డెన్‌ చెపాక్‌ స్టేడియంలోనే ఆటగాళ్లంతా సాధన చేస్తుంటారు. తమిళ అభిమానులు సైతం ప్రాక్టీస్‌ సెషన్లను వేల సంఖ్యలో వీక్షిస్తుంటారు. ఇలాంటి శిబిరం ఏర్పాటు చేయడం వల్ల జట్టులోని ఆటగాళ్ల అనుబంధం మెరుగవుతుంది. ఎవరి బలాలేంటి, ఎవరి బలహీనతలేంటో తెలిసిపోతాయి. నెట్‌ బౌలర్లు, సహాయ సిబ్బంది కూడా వీటికి హాజరవుతారు. మున్ముందు జరగబోయే సీజన్‌కు వ్యూహాలు రచించుకుంటారు. సెంటిమెంటు పరంగా చెపాక్‌ (chepauk stadium) అంటే సీఎస్‌కేకు (CSK) ఎంతో ఇష్టం. అలాంటి ఈ సారి ఆ డెన్‌ను సూరత్‌కు (Surat) మార్చేశారు.


ఈ సారి సూరత్‌కు


చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ సారి తమ శిక్షణ శిబిరాన్ని సూరత్‌ నగరానికి మార్చేసింది. ఈ నిర్ణయం వెనక ఎంఎస్‌ ధోనీ మాస్టర్‌ బ్రెయిన్‌ ఉందని అంటున్నారు. ఈ ఏడాది లీగు మ్యాచులన్నీ ముంబయి, పుణెలోని నాలుగు స్టేడియాల్లో జరుగుతాయి. వీలైతే ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో (Narendra Modi Stadium) నిర్వహిస్తారని అంచనా. వీటన్నిటినీ గమనించిన ఎంఎస్‌ ధోనీ, సీఎస్‌కే తెలివిగా ఆలోచించారు. ప్రాక్టీస్‌ క్యాంప్‌ను సూరత్‌కు మార్చేశారు. ఎందుకంటే ముంబయిలోని స్టేడియాల్లో ఉపయోగించిన మట్టితోనే సూరత్‌లోని లాల్‌భాయ్‌ కాంట్రాక్టర్‌ స్టేడియం (Lalbhai Contractor Stadium)  పిచ్‌లను రూపొందించారు. పరిస్థితులు కూడా ముంబయి, మహారాష్ట్ర తరహాలోనే ఉంటాయి. పైగా కొత్త స్టేడియం. ఇవన్నీ ఆటగాళ్లకు ముంబయి పరిస్థితులకు అనుభవం అవుతాయి.


CSK  సీనియర్‌ క్రికెటర్లు హాజరు


సీఎస్‌కే క్యాంపునకు ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా (Ravindra Jadeja), డ్వేన్‌ బ్రావో (Dwane Bravo), అంబటి రాయుడు (Ambati Rayudu), రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప వంటి క్రికెటర్లు వస్తారు. వారితో పాటు యువ క్రికెటర్లు, నెట్‌బౌలర్లు కలిసి పనిచేస్తారు. దాంతో జట్టు కూర్పు మెరుగవుతుంది.