India Promo For T20 World Cup 2024 Video Shakes Internet: : క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)  జూన్‌ 1 నుంచి  ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపడబోతోంది. జూన్‌ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్‌ జూన్‌ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్‌ ఏ లో భారత్‌(Team India), పాకిస్థాన్‌(Pakistan) జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్‌ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌నకు ఐసీసీ రిజర్వ్‌ డేలను ప్రకటించింది.


టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో 
ఈ క్రమంలో ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ తాజాగా టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను రిలీజ్  చేసింది. 'రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్ కు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?' అనే క్యాప్షన్‌తో ఎక్స్ వేదిక‌గా ఈ వీడియోను పంచుకుంది. వీడియో బ్యాక్ గ్రౌండ్ లో భారత జాతీయ గేయం 'వందేమాత‌రం'ను ప్లే చేయ‌డం జ‌రిగింది. వీడియోలో భార‌త జ‌ట్టు కీల‌క ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజాల‌ను చూపించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.  చివరలో కోహ్లీ సెల్యూట్‌ చేస్తున్న క్లిప్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతుంది. 






ఈసారి పెరిగిన జట్ల సంఖ్య 
2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి.


టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి.


ఆ మూడు మ్యాచ్‌లకు..

టీ 20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌కు రిజర్వ్‌ డేను కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. రెండు సెమీస్‌ మ్యాచ్‌లూ జూన్‌ 27నే జరగనుండగా.. ఫైనల్‌ను జూన్‌ 29న నిర్వహిస్తారు. ఈ మూడు మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేలను నిర్వహిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. 

 

టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌ షెడ్యూల్‌

ఇండియా vs ఐర్లాండ్‌ - జూన్‌ 5 (న్యూయార్క్)

ఇండియా vs పాకిస్థాన్‌ - జూన్‌ 9 ( న్యూయార్క్)

ఇండియా vs యూఎస్‌ఏ - జూన్‌ 12 (న్యూయార్క్)

ఇండియా vs కెనడా - జూన్‌ 15 (ఫ్లోరిడా) 

 

వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.