Du Plessis,  Curran fined for IPL Code of Conduct breaches:  కోల్‌కత్తా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో పరాజయంతో తీవ్ర ఆవేదనలో కూరుకుపోయిన బెంగళూరు(RCB) కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌కు మరో షాక్‌ తగిలింది.  డుప్లెసిస్‌కు ఐపీఎల్‌(IPL) నిర్వాహకులు రూ. 12 లక్షల జరిమానా విధించారు. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా డుప్లెసిస్‌కు ఈ జరిమానా విధించినట్లు ప్రకటించారు. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున ఈ ఫైన్‌ వేశారు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడో కెప్టెన్‌గా‌ డుప్లెసిస్ నిలిచాడు. ఐపీఎల్ నియమావళి ప్రకారం నిర్ణీత సమయంలోపు ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ జట్టు కెప్టెన్‌పై మినిమమ్ ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తారు. స్లో ఓవర్‌ రేట్‌కు తొలిసారి రూ. 12 లక్షలు, రెండోసారి ఇలానే జరిగితే రూ. 24 లక్షల జరిమానా, జట్టు సభ్యుల వేతనంలో కోత పడుతుంది. తరువాత కూడా జరిగితే జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

 

శామ్‌ కరణ్‌కి కూడా..

పంజాబ్‌ కెప్టెన్‌ శామ్‌ కరణ్‌కు కూడా ఐపీఎల్‌ నిర్వాహకులు షాక్‌ ఇచ్చారు. శామ్‌ కరణ్‌కు IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం ఈ జరిమానా విధించామని ప్రకటించారు. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసి కరణ్ లెవల్ వన్‌ నేరానికి పాల్పడ్డారని... అందుకే అతని మ్యాచ్ ఫీజులో సగం జరిమానా విధించామని తెలిపారు. శామ్‌ కరణ్‌ లెవల్‌ వన్‌ నేరానికి పాల్పడ్డాడడని.. అతను తన నేరాన్ని అంగీకరించాడని ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. 

 

బెంగళూరుకు  ఈ ఒక్క దారే..

ఇప్పటివరకూ ఐపీఎల్‌ చరిత్ర చూసుకుంటే కనీసం 8 మ్యాచులు గెలిచిన జట్లు క్వాలిఫైయర్స్ కి అర్హత సాధించాయి. 8 మ్యాచ్ లు గెలిస్తే 16 పాయింట్లు ఉంటాయి. అప్పుడప్పుడూ  7 మ్యాచ్ లు గెలిచిన జట్లు కూడా 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లాయి. ఈ ఐపీఎల్‌లో బెంగళూరు ఇప్పటికే ఎనిమిది మ్యాచులు ఆడేసింది. ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒకవేళ బెంగళూరుకు మిణుకుమిణుకుమంటున్న ఆశలైనా సజీవంగా ఉండాలంటే మిగిలి ఉన్న ఈ ఆరుకు ఆరు మ్యాచులను  గెలవాలి. అప్పుడు వారికి లభించి 12పాయింట్లు... ఇప్పటికే ఉన్న రెండు పాయింట్లు కలిపి 14పాయింట్లు అవుతాయి. ఇదే టైమ్ లో ఇప్పుడు టాప్ 4లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లు ఓడిపోవాలి. అది కూడా పంజాబ్, ఢిల్లీ, ముంబై , లక్నో చేతుల్లో అవి చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. అప్పుడు 14 పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లేందుకు కనీసం ఒక్క టీమ్ కైనా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ లో నిలబడే అర్హత బెంగుళూరు సాధించాలి. ఇప్పుడు బెంగుళూరు రన్ రేట్ -1.046 ఉంది కాబట్టి..ఆర్సీబీ గెలవబోయే 6 మ్యాచుల్లోనూ బీభత్సమైన రన్ రేట్ సంపాదించుకోవాలి. అప్పుడు 14పాయింట్లతో క్వాలిఫైయర్స్ కి వెళ్లే ఒక్క జట్టుగా ఆర్సీబీ నిలిస్తే చాలు..ఈ సాలా కప్ నమ్మదే.