Punjab Kings vs Chennai Super Kings: ఐపీఎల్‌ 2023 సీజన్ 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఓడించింది. చివరి బంతి వరకు థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఒత్తిడితో పాటు మ్యాచ్‌ను కూడా జయించింది. ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ 201 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. చెపాక్ స్టేడియంలో అత్యధిక లక్ష్య ఛేదన ఇదే కావడం విశేషం.


పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా కృష్టి చేశారు. ప్రభ్ సిమ్రన్ సింగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియాం లివింగ్‌స్టోన్ మెరుపులు మెరిపించాడు. మరోవైపు సీఎస్కే బ్యాటర్లలో ఓపెనర్ డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇది డెవాన్ కాన్వేకు ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు.


సమష్టిగా ఆడిన పంజాబ్
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు అద్భుతమైన ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (42: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలోనే 50 పరుగులు జోడించారు. అనంతరం తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి శిఖర్ ధావన్ అవుటయ్యాడు.


క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ అథర్వ తైడే (13: 17 బంతుల్లో), మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా కాసేపటికే అవుటయ్యారు. అయితే ఇంగ్లండ్ ద్వయం లియామ్ లివింగ్‌స్టోన్ (40: 24 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు), శామ్ కరన్ (29: 20 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) పంజాబ్‌ను ఆదుకున్నారు. వీరు నాలుగో వికెట్‌కు 33 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు. వీరిద్దరూ కీలక సమయంలో అవుటయ్యారు. జితేష్ శర్మ (21: 10 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చివరి బంతికి సికందర్ రాజా ఒత్తిడిలో కూడా మూడు పరుగులు తీసి చెన్నైని గెలిపించాడు.


చితక్కొట్టిన కాన్వే
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (37: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), డెవాన్ కాన్వే (92 నాటౌట్: 52 బంతుల్లో, 16 ఫోర్లు, ఒక సిక్సర్) బౌండరీలతో చెలరేగారు. దీంతో ఆరు ఓవర్ల పవర్‌ ప్లే ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.ఆ తర్వాత కూడా వీరు వేగంగా ఆడారు. మొదటి వికెట్‌కు 86 పరుగులు జోడించిన అనంతరం సికందర్ రాజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ స్టంపౌట్ అయ్యాడు.


ఆ తర్వాత వచ్చిన శివం దూబే (28: 17 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) కాసేపు వేగంగా ఆడి అవుటయ్యాడు. మొయిన్ అలీ (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు), రవీంద్ర జడేజా (12: 10 బంతుల్లో) కూడా విఫలం అయినా మరో ఎండ్‌లో డెవాన్ కాన్వే బౌండరీలు కొట్టడం ఆపలేదు. ఒక దశలో సెంచరీ చేస్తాడు అనిపించినా చివరి ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వైడ్ యార్కర్లతో ఇబ్బంది పెట్టడంతో సాధ్యం కాలేదు. చివరి రెండు బంతులను సిక్సర్లు కొట్టిన మహేంద్ర సింగ్ ధోని (13 నాటౌట్:  4 బంతుల్లో, రెండు సిక్సర్లు) చెన్నై 200 పరుగులు మైలురాయిని అందుకునేలా చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరన్, రాహుల్ చాహర్, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు.