CSK vs PBKS  IPL 202 Punjab Kings opt to bowl: ఐపీఎల్‌(IPL) డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)తో జరుగుతున్న కీలకమ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌(PBKS) ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ధర్మశాల స్టేడియంలోని హైబ్రిడ్‌ పిచ్‌పై ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ టోర్నీలో 200పైన స్కోర్లు తరచూ నమోదవుతున్నాయి. 200కుపైగా లక్ష్యం కూడా నిలవట్లేదు. ఈ పరిస్థితుల్లో బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించాలన్న ఉద్దేశంతో ఈ హైబ్రిడ్‌ పిచ్‌లను రూపొందిస్తున్నారు. ఈ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి పిచ్‌లు తయారుచేయడానికి బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20, వన్డేల్లో హైబ్రిడ్‌ పిచ్‌ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ ఈ పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి.

గత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెన్నై జట్టు కసిగా ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై 162 పరుగులు చేయగా... పంజాబ్‌ సునాయసంగా ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలుపు తప్పనిసరి కావడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చెన్నై, పంజాబ్‌ జట్లు పట్టుదలతో ఉన్నాయి. పంజాబ్‌పై ఘన విజయం సాధించి ప్లే ఆఫ్‌ రేసులో ముందుకు వెళ్లాలని రుతురాజ్‌ సారధ్యంలోని చెన్నై జట్టు భావిస్తోంది.

 

లోపాలు అధిగమించి...

ఈ మ్యాచ్‌లో చెన్నై ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ కీలకమ్యాచ్‌లో తిరిగి విజయాల బాట పట్టాలని రుతురాజ్‌ సేన పట్టుదలగా ఉంది. కానీ సొంత మైదానం చెపాక్‌లో చెన్నైపై విజయం  సాధించిన పంజాబ్‌ కూడా ఆత్మవిశ్వాసంతో ఉంది. చెన్నై 10 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పంజాబ్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లు జరగనున్నాయి.

 

చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐదు విజయాలతో 10 పాయింట్లను కలిగి ఉంది. 16 పాయింట్లు సాధించాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడు మ్యాచ్‌ల్లో చెన్నై గెలవాలి. అందుకే ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. గత మ్యాచ్‌లో పంజాబ్‌  స్పిన్నర్లు హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్‌లను ఎదుర్కోవడంలో చెన్నై తడబడింది. కేవలం ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులే చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేపై చెన్నై బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. రుతురాజ్‌ గైక్వాడ్ ఈ సీజన్‌లో ఇప్పటికే అయిదుసార్లు 50కుపైగా పరుగులు చేసి సత్తా చాటాడు. అనుభవజ్ఞుడైన బ్యాటర్ అజింక్య రహానే, రవీంద్ర జడేజా రాణించాల్సి ఉంది. దీపక్ చాహర్‌ ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మతీషా పతిరాణ, తుషార్ దేశ్‌పాండే.. పైనే చెన్నై బౌలింగ్‌ భారం ఉంది.

 

హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌

ఐపీఎల్‌లో పంజాబ్‌-చెన్నై 29 మ్యాచుల్లో తలపడ్డాయి. అయిదుసార్లు ఛాంపియన్‌ అయిన చెన్నై 15 విజయాలు సాధించింది. పంజాబ్‌ 14 విజయాలు సాధించింది. ఫలితం లేకుండా ఒక్క మ్యాచ్‌ కూడా ముగియలేదు. ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున చెన్నైపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కేఎల్ రాహుల్.