Sameer Rizvi s explosive batting goes viral: చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) యువ ఆట‌గాడు స‌మీర్ రిజ్వీ(Sameer Rizvi )త‌న ఐపీఎల్ కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. ఐపీఎల్‌లో తన ఎదుర్కొన్న తొలి బంతినే సిక్స్‌గా మలిచి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పరిగణిస్తున్న రషీద్‌ఖాన్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచాడు. అనంతరం మరో భారీ సిక్స్‌ కొట్టాడు. మొత్తం 6 బంతుల్లో 14 పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ చేతిలో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రిజ్వీ.. 2 సిక్స్‌ల సాయంతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ చరిత్రలో కెరీర్‌లో తొలి బంతినే సిక్సర్‌ బాదిన తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. తొలి మ్యాచ్‌లోనే క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకట్టుకున్న సమీర్‌ రిజ్వీని ఓ వివాదం చుట్టుముట్టింది.



టీ20లో ధనాధన్‌ బ్యాటింగ్‌
సమీర్‌ రిజ్వీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌తో రిజ్వీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీ20 క్రికెట్‌లో కేవలం 9 ఇన్నింగ్స్‌లలో రిజ్వీ 49.16 సగటుతో 295 పరుగులు చేశాడు. గతేడాది జరిగిన యూపీ టీ20 లీగ్‌లో కన్పూర్‌ సూపర్‌ స్టార్స్‌ తరపున ఆడిన రిజ్వీ.. 455 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో కూడా రిజ్వీ అదరగొట్టాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా 18 సిక్స్‌లు రిజ్వీ కొట్టాడు. ఈ క్రమంలో తన పేరును ఐపీఎల్‌ వేలంలో రిజిస్టర్‌ చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్‌-2024 మినీవేలంతో అతడి దశ తిరిగిపోయింది. రూ. 20 లక్షలతో వేలంలోకి వచ్చిన సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్ల భారీ ధరకు చెన్నై సూపర్‌ కింగ్స్ సొంతం చేసుకుంది.


చెన్నై వరుసగా రెండో విజయం
ఐపీఎల్‌ 17వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివమ్ దూబె అర్థ సెంచరీతో చెలరేగగా రచీన్‌ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్‌ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్, స్పెన్సర్‌ జాన్సన్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసి ఓటమి పాలైంది.ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్‌ 37, సాహా 21, మిల్లర్‌ 21 పరుగులు చేశారు. మిగతావారు విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపర్‌ చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌ రెహ్మన్‌ తలో రెండు వికెట్లు తీయగా, డారిల్ మిచెల్, పతిరన ఒక్కో వికెట్‌ పడగొట్టారు.