IPL 2023, CSK vs GT: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2023 సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. తన మొదటి మ్యాచ్‌లో బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు వికెట్లతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. అనంతరం గుజరాత్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (63: 36 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (25: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ మొదటి బంతి నుంచే చెలరేగి ఆడారు. వీరు మొదటి వికెట్‌కు 3.5 ఓవర్లలోనే 37 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ (22: 17 బంతుల్లో, మూడు ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8: 11 బంతుల్లో) విఫలం అయ్యాడు. కాసేపటికే క్రీజులో కుదురుకున్న శుభ్‌మన్ గిల్ కూడా అవుట్ కావడంతో మ్యాచ్ మెల్లగా చెన్నై చేతిలోకి వచ్చింది.


క్రీజుల్లో ఉన్నంత సేపు భారీ షాట్లకు ప్రయత్నించిన విజయ్ శంకర్‌ని (27: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కొత్త కుర్రాడు రాజ్‌వర్థన్ హంగర్గేకర్ అవుట్ చేసి మ్యాచ్‌ను దాదాపు గెలిపించినంత పని చేశాడు. కానీ చివర్లలో రషీద్ ఖాన్ (10 నాటౌట్: 3 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), రాహుల్ టెవాటియా (15 నాటౌట్: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మెరుపుల్లాంటి షాట్లతో బౌండరీలు సాధించడం విజయం గుజరాత్‌ను గెలిపించింది.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై బ్యాటింగ్‌కు దిగింది. చెన్నైకి ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డెవాన్ కాన్వేను (1: 6 బంతుల్లో) మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 14 పరుగులకే చెన్నై మొదటి వికెట్ కోల్పోయింది. కానీ వన్‌డౌన్‌లో వచ్చిన మొయిన్ అలీ (23: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92: 50 బంతుల్లో, నాలుగు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) మెరుపు వేగంతో ఆడారు. వీరు రెండో వికెట్‌కు 21 బంతుల్లోనే 36 పరుగులు జోడించారు. చెన్నై సూపర్ కింగ్స్ 5.4 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును చేరుకుంది. కానీ ఈ దశలో రషీద్ ఖాన్ చెన్నైని గట్టి దెబ్బ కొట్టాడు. వరుస ఓవర్లలో మొయిన్ అలీ, బెన్ స్టోక్స్‌లను (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేశాడు.  దీంతో చెన్నై 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


అనంతరం వచ్చిన అంబటి రాయుడు (12: 12 బంతుల్లో, ఒక సిక్సర్), రుతురాజ్ గైక్వాడ్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరు నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడిస్తే... అందులో రాయుడువి కేవలం 12 పరుగులే. రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 24 బంతుల్లోనే అర్థ సెంచరీని సాధించాడు. అల్జారీ జోసెఫ్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టడం విశేషం. వీరి భాగస్వామ్యం చెన్నైని భారీ స్కోరు దిశగా తీసుకెళ్తున్న దశలో రాయుడు అవుటయ్యాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్ కూడా నెమ్మదించాడు.


శివం దూబే (19: 18 బంతుల్లో, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోవడంతో ఆ ఒత్తిడి రుతురాజ్‌పై పడింది. దీంతో భారీ షాట్లకు ప్రయత్నించి సెంచరీకి దగ్గరలో అవుటయ్యాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (14 నాటౌట్: 7 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. దీంతో ఒక దశలో 200 పరుగులను అలవోకగా కొడుతుందనుకున్న చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులకే పరిమితం అయింది.