Suresh Raina CSK IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ లీగ్‌లో అత్యంత అనుభవం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్. దాదాపు ప్రతి సీజన్‌లోనూ చెన్నై ప్రదర్శన అద్భుతంగా ఉంది.


ఐపీఎల్ టోర్నమెంట్‌లో రెండు సీజన్‌లు మినహా ప్రతి సీజన్‌లో CSK ప్లేఆఫ్‌లకు చేరుకుంది. దీంతోపాటు రెండు సీజన్లలో టోర్నీలో ఆడలేదు. కాగా సురేష్ రైనా అందుబాటులో లేని రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్‌కు చేరుకోలేదు.


సురేష్ రైనా ఐపీఎల్ తొలి సీజన్ లోనే అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై వేగంగా బ్యాటింగ్ చేసి వార్తల్లో నిలిచాడు. రైనా కేవలం 13 బంతుల్లోనే మూడు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అప్పటి నుండి సురేష్ రైనా మంచి ప్రదర్శనను కొనసాగించాడు. అందుకే రైనాకు 'మిస్టర్ ఐపీఎల్' అనే పేరు వచ్చింది.


ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సురేష్ రైనా జట్టులో ఉన్నప్పుడల్లా చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకుంది. కానీ అతను జట్టులో రెండు సీజన్లు భాగం కాలేదు. ఆ రెండు సీజన్లలోనూ చెన్నై ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.


2008 నుండి 2015 వరకు ఆడిన ప్రతి సీజన్‌లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఈ సమయంలో సురేష్ రైనా జట్టులో భాగమయ్యాడు. అయితే ఆ తర్వాత చెన్నై మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా రెండేళ్ల నిషేధానికి గురైంది. CSK 2016, 2017లో IPLలో భాగం కాలేదు. దీని తర్వాత అతను తిరిగి వచ్చాడు. 2018, 2019లో చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.


కానీ ఆ తర్వాత 2020 సంవత్సరంలో సురేష్ రైనా జట్టులో భాగం కాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అప్పుడు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది. దీని తర్వాత 2021లో రైనా తిరిగి వచ్చిన తర్వాత జట్టు మళ్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కానీ 2022లో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా జట్టులో భాగం కాలేదు. ఈ సీజన్‌లో చెన్నై కూడా ప్లేఆఫ్స్‌కు చేరలేదు. ఇప్పటి వరకు సురేష్ రైనా ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 పరుగులు చేశాడు.


టీమిండియాకు విలువైన పరుగులు చేసిన రైనా దేశవాళీ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు. మొత్తం 205 మ్యాచ్‌లాడిన రైనా.. 32.51 సగటు, 136.76 స్ట్రైక్ రేట్‌తో 5,528 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో శతకం బాదిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్ లో ఓ శతకం, 39 అర్ధ శతకాలు చేశాడు రైనా. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రైనా, 2020 ఒక్క సీజన్ కు దూరంగా ఉన్నాడు. గత సీజన్ లో ఆడిన రైనా 12 మ్యాచ్‌లలో కేవలం 160 రన్స్ చేశాడు.


క్రికెటర్ సురేష్ రైనా గతేడాది సెప్టెంబర్‌లో అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన రాష్ట్రం యూపీకి, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఆ సందర్భంలో చెప్పాడు. బీసీసీఐకి, యూపీ క్రికెట్ అసోసియేషన్‌కు, సీఎస్కేకు, రాజీవ్ శుక్లాకు ధన్యవాదాలు తెలిపాడు.