భారత క్రికెట్ అభిమానుల కోసం మరో ఉత్కంఠభరమైన సిరీస్ రేపే(బుధవారం) ప్రారంభంకానుంది. భారత్ x ఇంగ్లాండ్ (ENGvIND) మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ రేపు ప్రారంభంకాబోతోంది. నాటింగ్‌హామ్ వేదికగా ఈ రెండు జట్లు తొలి టెస్టులో తలపడతాయి. మధ్యాహ్నం 3.30గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత్(TeamIndia)... సుమారు 40 రోజులకు పైగా క్రికెట్‌కి విరామం ఇచ్చింది.  



తొలి టెస్టులో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో
పేసర్‌ సిరాజ్‌ వేసిన బంతి మయాంక్‌ అగర్వాల్ తలకి బలంగా తాకి గాయమైంది. దీంతో అతడు కంకషన్‌కు గురి కావడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. మయాంక్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా కొత్త ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌‌లో ఎవర్ని ఆడిస్తారో చూడాలి. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఉన్నాడు. కేఎల్ రాహుల్‌ని మిడిలార్డర్‌లో ఆడించాలని టీమ్ భావిస్తున్నట్లు సమాచారం.  

6వ స్థానంలో స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా విహారిని ఆడించడంపై కూడా సందేహం తలెత్తుతుంది. అతడ్ని పక్కన పెట్టి స్పిన్‌ ఆల్‌రౌండర్లయిన జడేజా, అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది. పంత్‌ ఆరో స్థానంలో ఆడితే.. జడేజా, అశ్విన్‌ ఆ తర్వాతి స్థానాల్లో వస్తారు. పేస్‌ భారాన్ని ఇషాంత్‌, షమి, బుమ్రాలు పంచుకోవాలి. హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌ను తొలి టెస్టులో ఆడించడం అనుమానమే.


తొలి టెస్టుకు భారత జట్టు అంచనా: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చటేశ్వర పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జస్‌ప్రీత్ బుమ్రా. 


‘టెస్టు క్రికెట్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) తీసుకురావడం కొత్త మార్పుకు నాంది. మూడేళ్ల క్రితం టెస్టు క్రికెట్‌కి అనుకున్నంత ఆదరణ లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఎప్పుడైతే టెస్టు క్రికెట్‌ని టీవీలో చూసేవాళ్లు... ఏ ఒక్క బంతి చూడటం మిస్ అవ్వకూడదని ఎప్పుడు భావిస్తారో అప్పుడు టెస్టు క్రికెట్ పరిస్థితి ఇంకా బాగుంటుంది’ అని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు.  


జోరుగా ప్రాక్టీస్


తొలి టెస్టు కోసం ఆటగాళ్లు నెట్స్‌లో బాగా కష్టపడుతున్నారు. కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో కోహ్లీ సేన టెన్నిస్ బంతులతో క్యాచ్‌లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  ఆటగాళ్లు ప్రాక్టీస్ ఫొటోలు, వీడియోలను BCCI ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది. 


 






భారత్ x ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ షెడ్యూల్‌


తొలి టెస్టు: ఆగస్టు 4 - 8, నాటింగ్‌హామ్ 
రెండో టెస్టు: ఆగస్టు 12 - 16, లండన్‌ 
మూడో టెస్టు: ఆగస్టు 25 - 29, లీడ్స్‌
నాలుగో టెస్టు: సెప్టెంబరు 2 - 6, లండన్‌
ఐదో టెస్టు: సెప్టెంబరు 10 - 14, మాంచెస్టర్‌