శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (112 నాటౌట్: 51 బంతుల్లో, ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు)శతకంతో అజేయంగా నిలిచాడు. అనంతరం శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా సిరీస్‌ను కూడా 2-1తో గెలుచుకుంది.


229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు యావరేజ్ స్టార్ట్ లభించింది. ఓపెనర్లు పతుం నిశ్శంక (15: 17 బంతుల్లో, మూడు ఫోర్లు), కుశాల్ మెండిస్ (23: 15 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) మొదటి వికెట్‌కు 44 పరుగులు జోడించారు. అయితే ఏడు పరుగుల వ్యవధిలోనే భారత బౌలర్లు చెలరేగి మూడు వికెట్లు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా శ్రీలంకను భారత బౌలర్లు కోలుకోనివ్వలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ శ్రీలంకను ఆలౌట్ చేశారు.


లంక బ్యాటర్లలో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మలిక్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. పేలవ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ మధుశంక బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. గిల్ నెమ్మదిగా ఆడటంతో ఆ తర్వాత 2 ఓవర్లలో ఎక్కువ పరుగులు రాలేదు. అయితే వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి రెచ్చిపోయి ఆడాడు. వచ్చీ రావడంతోనే 2 బౌండరీలు కొట్టిన రాహుల్.. చమిక కరుణరత్నే వేసిన 6వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాదాడు. అయితే ఆ తర్వాతి బంతికే అతను ఔటయ్యాడు. పవర్ ప్లే అయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 52 పరుగులు చేసింది. 


ఆ తర్వాత ఇంక అంతా సూర్య ప్రతాపమే. వచ్చీ రావడంతోనే బాదుడు మొదలుపెట్టిన సూర్యకుమార్ ఎక్కడా తగ్గలేదు. తన ఇన్నింగ్స్ అంతటా హిట్టింగే హిట్టింగ్. బౌలర్ ఎవరైనా బాదడం మాత్రం ఆపలేదు సూర్య. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించిన స్కై సెంచరీతో చెలరేగాడు. 25 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడిన సూర్యకుమార్ మహీశ్ థీక్షణ వేసిన 14వ ఓవర్లో విధ్వంసమే సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6 బాదాడు. గిల్ కూడా ఒక ఫోర్ సాధించటంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. అనంతరం హసరంగ బౌలింగ్ లో గిల్ బౌల్డయ్యాడు.


గిల్, సూర్య మూడో వికెట్ కు 111 పరుగులు జోడించారు. అనంతరం జోరు పెంచిన సూర్య 41 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు.  51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. మధ్యలో హార్దిక్ పాండ్య (4), దీపక్ హుడా (4) అలా వచ్చి ఇలా వెళ్లారు.  చివర్లో అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21) వేగంగా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2 వికెట్లు తీసుకున్నాడు. రజిత, కరుణరత్నే, హసరంగా తలా వికెట్ దక్కించుకున్నారు.