Minister Roja Vs Nagababu : జనసేన నేత నాగబాబు చేసిన విమర్శలకు మంత్రి రోజా సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. పర్యాటక శాఖపై సరైన అవగాహన లేకుండా నాగబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు మంత్రి రోజా ఓ పోస్టు పెట్టారు. 


"ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి. అంతే గానీ నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదు. ఏం తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం వాళ్ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక ఇండియాలో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉంది. ఇదేం తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. నేను ఏనాడు చిరంజీవి కేంద్రమంత్రిగా పర్యాటకంగా ఏపీకి ఏం చేశారని రాజకీయంగా మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి. గతంలో టీడీపీ-జనసేన మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు. గతంలో వాళ్లేం మాట్లాడుకున్నారో చూపించి.. సదరు వ్యక్తికి ఈ వీడియో చేరేలా ఉండాలని షేర్ చేస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా నా వ్యాఖ్యలుంటాయని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను అంత మాట అన్నందుకు మిమ్మల్ని కూడా ఓ మాట అనొచ్చు. కానీ నా సంస్కారం అడ్డొచ్చింది అంతే. చివరగా ఒక్క మాట ఆనాడు మీ పార్టీ వాళ్లను సంకరజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలి. ఓడిపోయిన మీరే అన్ని మాటలంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి. రాజకీయ విమర్శలు తప్పా, వ్యక్తిగత విమర్శలు చేయడం నాకిష్టం లేక మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నాను.. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుసుకోండి" అని మంత్రి రోజా అన్నారు. 


నాగబాబు ఏమన్నారంటే? 


మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన మంత్రి రోజాపై నాగబాబు సీరియస్ అయ్యారు. ముందు పర్యాటక శాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్ని రోజులు రోజా చేస్తున్న కామెంట్స్‌పై ఎందుకు స్పందించలేదో రీజన్ కూడా చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రజలకు మెగా ఫ్యామిలీ చేసిందేమీ లేదని.. అందుకే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతున్నారని రోజా చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో రోజాను మెగా ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇప్పుడు సీన్‌లోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. రోజా నోరు.. మున్సిపాలిటీ కుప్పుతొట్టే ఒకటేనంటూ కామెంట్ చేశారు. అందుకే ఇన్నిరోజులు ఏమీ అనలేదన్నారు. కావాలనే మున్సిపాలిటీ కుప్పతొట్టెను ఎవరూ కెలకరని.... అందుకే రోజా కామెంట్స్‌పై రియాక్ట్ కాలేదన్నారు. ప్రస్తుతం పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్‌ 18వ స్థానంలో ఉందని... దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రోజా ఆలోచిస్తే బెటర్ అన్నారు నాగబాబు. ఇలా మాట్లాడుతూ పోతే... రోజా పదవి నుంచి దిగిపోయేసరికి కచ్చితంగా 20వ స్థానానికి దిగజారుతుందని ఎద్దేవా చేశారు. పర్యటక శాఖను డెవలప్ చేయడమంటే... రోజా పర్యటనలు చేయడం కాదని వ్యంగ్యంగా స్పందించారు. ఈ శాఖను నమ్ముకొని వేల మంది జీవిస్తున్నారని వాళ్లందరి బాగు కోసం ఏదైనా చేయాలని సలహా ఇచ్చారు.