IND vs SL 2nd Test: గులాబి టెస్టులో తొలిరోజు టీమ్‌ఇండియాదే! మొదటి సెషన్లో భారత టాప్‌ ఆర్డర్‌ను లంకేయులు పడగొట్టారు. రెండో సెషన్లో శ్రేయస్‌ అయ్యర్‌ (92; 98 బంతుల్లో 10x4, 4x6) తన బ్యాటుతో వారికి జవాబు చెప్పాడు. మూడో సెషన్లో ఇండియన బౌలర్లు ప్రత్యర్థిని భారీ దెబ్బకొట్టారు. మొదట బ్యాటింగుకు దిగిన హిట్‌మ్యాన్‌ సేన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లంకేయులు ఆట ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేశారు. ఏంజిలో మాథ్యూస్‌ (43) ఫర్వాలేదనిపించాడు. లంక 166 పరుగుల లోటుతో ఉంది. టీమ్‌ఇండియాలో హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), రిషభ్ పంత్‌ (39; 26 బంతుల్లో 7x4) స్కోరు  కంట్రిబ్యూట్‌ చేశారు. మొత్తంగా తొలిరోజు 16 వికెట్లు పడ్డాయి.


విలవిల్లాడించిన పేసర్లు


డే/నైట్‌ టెస్టు కావడం, ఫ్లడ్‌లైట్లు వెలగడంతో రోహిత్‌ శర్మ ఎక్కువగా పేసర్లకే బంతినిచ్చాడు. అందుకు తగ్గట్టే వారు రాణించారు. బంతిని చక్కగా స్వింగ్‌ చేశారు. ఇన్నింగ్స్‌ 2.1వ బంతికి ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ (2)ను జస్ప్రీత్‌ బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత సరిగ్గా 12వ బంతికి లాహిరు తిరుమానె (8)ను ఔట్‌ చేశాడు. అప్పటికి స్కోరు 14. ఈ రెండు క్యాచులను శ్రేయస్‌ అయ్యరే అందుకున్నాడు. మళ్లీ అదే స్కోరు వద్ద దిముతు కరుణరత్నె (4)ను షమి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మళ్లీ అతడే ధనంజయ డిసిల్వా (10)ను ఎల్బీ చేశాడు. చరిత్‌ అసలంక (5)ను అక్షర్‌ పటేల్‌ ఔట్‌ చేశాడు. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సీనియర్‌ బ్యాటర్ ఏంజిలో మాథ్యూస్‌ (43; 85 బంతుల్లో 3x4, 2x6) ఆదుకొనే ప్రయత్నం చేశాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. అయితే జట్టు స్కోరు 85 వద్ద అతడిని జస్ప్రీత్‌ బుమ్రా చేశాడు. ఎంబుల్దేనియా (0; 8 బంతుల్లో) నైట్‌వాచ్‌మన్‌గా వచ్చాడు. నిరోషన్‌ డిక్వెలా (13 బ్యాటింగ్‌; 29 బంతుల్లో 1x4) నిలిచాడు.


భయపెట్టిన పిచ్‌


టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియాకు కొద్దిసేపటికే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ (4) నోబాల్‌కు రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 10. మరికాసేపటికే రోహిత్‌ శర్మ (15)ను ఎంబుల్దెనియా పెవిలియన్‌ పంపించాడు. విచిత్రంగా బెంగళూరు పిచ్‌ విపరీతమైన టర్న్‌కు అనుకూలిస్తోంది. మొహాలి పిచ్‌తో పోలిస్తే రెండు డిగ్రీలు ఎక్కువగా బంతి టర్న్‌ అవుతోంది. ఒక్కోసారి అనూహ్యంగా బౌన్స్‌ అవుతోంది. దాంతో బ్యాటర్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. హనుమ విహారి (31; 81 బంతుల్లో 4x4), విరాట్‌ కోహ్లీ (23; 48 బంతుల్లో 2x4) కుదురుకున్నట్టే కనిపించినా ఆడక తప్పని బంతులేసిన లంక స్పిన్నర్లు వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపించారు.


అదరగొట్టిన శ్రేయస్‌


కష్టాల్లో పడిన టీమ్‌ఇండియా రిషభ్ పంత్‌ (Rishabh Pant), శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఆదుకున్నారు. స్పిన్‌ను నిలకడగా ఆడితే ఔటవుతుండటంతో పంత్‌ దూకుడుగా ఆడాడు. వరుస పెట్టి బౌండరీలు కొట్టాడు. కీలక సమయంలో అతడు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటి నుంచి అయ్యర్‌ అమేజింగ్‌ ఇన్నింగ్స్‌ మొదలైంది. కఠిన పిచ్‌పై అతడు బ్యాటింగ్‌ చేసిన తీరు మాత్రం అద్భుతం. టర్న్‌ను చక్కగా ఎదుర్కొంటూనే లూజ్‌ బాల్స్‌ పడితే బౌండరీకి పంపించాడు. అవతలి ఎండ్‌లోని బ్యాటర్లు కంగారు పడుతోంటే అతడు మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్‌తో పాటు నిలబడి సిక్సర్లు బాదేశాడు. 54 బంతుల్లోనే 50 పరుగులుపూర్తి చేశాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయి సిక్సర్లు కొట్టాడు. టెయిలెండర్లను అడ్డుపెట్టుకొని టీమ్‌ఇండియా స్కోరును 250 దాటించాడు. అయితే సెంచరీకి ముందు స్టంపౌట్‌ అయ్యాడు. నిజానికి శ్రేయస్‌ ఇన్నింగ్స్‌ డబుల్‌ సెంచరీతో సమానమని విశ్లేషకులు అంటున్నారు.